ఒక్క రోజులో అంత తాగేసారా - 31వ తేదీ నైట్ పార్టీలో : 39 కోట్ల బీర్లు - 44 కోట్ల ఆ సీసాలు..!!
కొత్త సంవత్సరం రాక...ఎక్సైజ్ శాఖకు పండుగ గా మారింది. లిక్కర్ ఏరులై పారింది. కోట్లాది రూపాయాల అమ్మకాలతో గల్లా పెట్ల కళకళలాడింది. ఒమిక్రాన్.. కరోనా ఇవేవీ న్యూ ఇయర్ పార్టీల ముందు నిలవలేదు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి మంచి కిక్కు ఇచ్చే సమయం. అంతే..లిక్కర్ వ్యాపారులు సైతం రోజు వారీ ఇండెట్ల కంటే భారీ స్థాయిలో సరుకు దించారు. వారి అంచనాలు ఎక్కడా తప్పలేదు. గత రెండేళ్లు కరోనా కారణంగా న్యూ ఇయర్ పార్టీలకు .. వేడుకలకు దూరంగా ఉన్న వారు ఈ ఏడాది మాత్రం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు
తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు సాగాయి. డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజే తెలంగాణలో రూ 108 కోట్ల మేర లిక్కర్ వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. గత అయిదు రోజుల్లోనే రూ.902 కోట్లకుపైగా విక్రయాలు జరిగాయి. డిసెంబరు నెల విక్రయాల్లోనూ అత్యధికం నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా రూ.3,435 కోట్లకు(2020 డిసెంబరులో రూ.2764 కోట్లు) చేరాయి. డిసెంబరు 27న 202.42 కోట్లు, 28న 155.48 కోట్లు, 29న రూ.149.53, 30న రూ.246.56 కోట్లు, 31న రాత్రి 7 గంటల వరకు రూ.148.52 కోట్ల అమ్మకాలు సాగాయి.
రెండేళ్ల తరువాత ఆశించిన స్థాయిలో
2020లో రూ.25,601.39 కోట్ల అమ్మకాలు జరగ్గా, 2021లో శుక్రవారం సాయంత్రానికే రూ.30,196 కోట్ల మేర నమోదయ్యాయి. మొత్తంగా ఏడాదంతా 3,68,68,975 కేసుల లిక్కర్, 3,25,82,859 కేసుల బీర్లు అమ్ముడైనట్టు ఎక్సైజ్ శాఖ లెక్క తేల్చింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.6,979 కోట్లు, నల్గొండ రూ.3,288 కోట్లు, హైదరాబాద్ రూ.3,201 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. కరోనా దెబ్బకు రెవిన్యూ పడిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో లిక్కర్ అమ్మకాలతో వచ్చిన రెవిన్యూ ఖజానాకు ఊరటనిచ్చింది.
ఖజానాకు న్యూ ఇయర్ జోష్
ఈ స్థాయి అమ్మకాలతో లిక్కర్ వ్యాపారుల్లో న్యూ ఇయర్ సంతోషం కనిపిస్తోంది. అయితే, ఏపీ సరిహద్దు మద్యం దుకాణ దారులకు మాత్రం అక్కడి ప్రభుత్వం తిరిగి గతంలో మాదిరిగా ప్రీమియం బ్రాండ్స్ ను అందుబాటులోకి తీసుకురావటంతో..వారు అనుకున్న విధంగా అమ్మకాలు సాగలేదని తెలుస్తోంది. ఏపీలోనూ లిక్కర్ సేల్స్ బాగానే జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఎక్సైజ్ అధికారులు అమ్మకాల లెక్కలు వెల్లడించాల్సి ఉంది.