మరో మూడ్రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు: హైదరాబాద్కు ఎల్లో అలర్ట్
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నగర జీవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో భారీ వర్షాలు, హైదరాబాద్కు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురస్తాయని పేర్కొంది. హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్లో దంచికొడుతున్న వానలు
హైదరాబాద్ నగరంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు వర్షం కురిసింది. గురువారం కూడా నగరంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.

రాష్ట్రంలోనూ భారీ వర్షాలు.. పిడుగుపాటుకు నలుగురు మృతి
మరోవైపు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు చనిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కన్నాయపల్లిలో పిడుగుపడి అలాట చంద్రమౌళి అనే వ్యక్తి మృతి చెందాడు. అతని రెండు ఎడ్లు కూడా చనిపోయాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం శివారులో పిడుగుపాటుకు సత్తన్న అనే ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.

ఏపీ జిల్లాల్లోనూ భారీ వర్షాలు
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నంద్యాల, కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలయమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.












Click it and Unblock the Notifications