రెండ్రోజులపాటు తెలంగాణలో వర్షాలు: బలంగా ఈదురుగాలులు
హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి నుంచి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి, చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఆదివారం రాత్రి వాయుగుండగా మారే సూచనలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
మరింత బలపడిన సోమవారం నాటికి తుఫానుగా మారుతుందని, ఈ నెల 25వ తేదీకి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాయువ్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మోస్తారు వర్షాలు కురిశాయి.
తుఫాను కారణంగా ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంలో సోమవారం వర్షాలు పడతాయని పేర్కొంది. మే 25,26 తేదీల్లో ఉత్తరాంధ్రలో చెదురుమదురు వర్షలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. కాగా, ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.