తెలంగాణలో 5 రోజులపాటు భారీ వర్షాలు: ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్, హైదరాబాద్లోనూ వానలు
హైదరాబాద్: నగరంతోపాటు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తాజాగా, వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మరో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది.
కొమురంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నైరుతి దిశకు విస్తరిస్తోంది. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ నగర పరిధిలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు రానున్న ఐదు రోజులపాటు కురుస్తాయని వెల్లడించింది.

సాయంత్రం నుంచి రాత్రి సమయంలోనే నగరంలో 5 నుంచి 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం కూడా హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
కాగా, గత రెండు రోజులుగా మంచిర్యాల, కొమురంభీమ్ అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 13.2 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, నెన్నెలలో 9.7 సెం.మీ వర్షపాతం రికార్డైంది. కామారెడ్డి జిల్లా పాతంరాజపేటలో 12.8, ఆదిలాబాద్ జిల్లా పొచ్చెరలో 10.4, కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్లో 9.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications