తెలంగాణలో మరో మూడు రోజులపాటు జోరు వానలు, ఆ జిల్లాలకు అలర్ట్
హైదరాబాద్: రాజధాని భాగ్యనగరంతోపాటు తెలంగాణ జిల్లాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షాలతో నగర జీవి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా, మరో మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గురువారం నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యదాద్ర భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

శనివారం వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లా అలర్ట్ జారీ చేసింది.
కాగా, బుధవారం రాత్రి హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. బుధవారం హైదరాబాద్లో సుమారు 4 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. ఇక ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వరదకు పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. గండిపేట చెరువుకు భారీ వరద పోటెత్తింది.












Click it and Unblock the Notifications