తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వానలు కూడా: ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. తీవ్రమైన ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. భారీ, వడగళ్ల వానలు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వరి, మామిడితోపాటు ఇతర పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు, రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం వరకు మరికొన్ని జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది.
ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు కురుస్తాయంటూ ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. కాగా, గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు, పంట నష్టం అంచనా వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు.












Click it and Unblock the Notifications