తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు: ధాన్యం తడిసిపోవడంతో రైతుల ఆందోళన
హైదరాబాద్: తెలంగాణలో ఓ వైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరోవైపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు మండుతుండగా.. సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడి పోతోంది. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
కాగా, మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందన్నారు. దాని ప్రభావంతో చిరజల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
గురువారం కూడా హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. వర్షంతోపాటు భీకరమైన ఈదురు గాలులకు పలు చోట్ల పంట, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి వాహనాలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్ల వానకు రైతు పండించిన ధాన్యం తడిసిముద్దైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన పంట..వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు చేతికచ్చిన పంట అమ్ముకునే సమయంలో ఇలా వర్షంతో తడిసిపోవడంతో కన్నీళ్లపర్యంతమవుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భీకరమైన ఈదురు గాలుల ప్రభావానికి పెద్దపెద్ద చెట్లు కూలిపోయాయి. ఈ ఘటనలో బస్టాండ్ ఆవరణలో చెట్ల కింద పార్క్ చేసిన నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. తుంగళ్లపల్లి మండలంలో గోడ కూలి బిహార్కు చెందిన వ్యక్తి చనిపోయాడు.
జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి రోడ్డులో దీప్తి కంటి ఆస్పత్రి ఎదురుగా ఉన్న చెట్టు కూలడంతో దాని కింద ఉన్న ఆటో పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈదురుగాలులకు బాబు బస్తీలోని ఓ ఇంటిపై చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోవైపు పాత బెల్లంపల్లి గ్రామంలో ఈదురుగాలి, భారీ వర్షానికి గోడ కూలి బాబు అనే కూలి మృతి చెందాడు. అకాల వర్షంతో పండించిన ధాన్యం నీటిలో మునిగిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.