హైదరాబాదులో మరో ఐసిస్ అనుమానితుడి పట్టివేత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు మరో ఐఎస్ఐస్ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని సంతోష్నగర్ ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అతన్ని ఈదీబజార్కు చెందిన నిజాముద్దీన్గా గుర్తించారు. అతన్ని అధికారులు ఎన్ఐఎ కార్యాలయానికి తరలించారు. హైదరాబాదులో విధ్వంసానికి కుట్ర పన్నిన ఐసిస్ అనుమానితులు ఇబ్రహీం ముఠాకు నిజాముద్దీన్ సహకరించినట్లు అనుమానిస్తున్నారు.
హైదరాబాదులో భారీ విధ్వంసానికి కుట్ర చేసిన ఇబ్రహీం ముఠాను ఎన్ఐఎ అధికారులు విస్తృతంగా విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా ఎన్ఐఎ అధికారులు అనంతపురం, నాందేడ్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో ఇబ్రహీం ముఠా సభ్యులు ఆయుధాలు కొనుగోలు చేసినట్లు అనుమానించి అధికారులు సోదాలు నిర్వహించారు.
ఐసిస్ సానుభూతిపరుల కుట్రలో నిజాముద్దీన్ పాత్ర ఎంత వరకు ఉందనేది తేలాల్సి ఉంది. అయితే, ఇబ్రహీం ముఠాకు ఎవరు ఆర్థిక సహకారం అందించారు, ఆయుధాలకు అవసరమైన పేలుడు పదార్థాలను ఇబ్రహీం ముఠా ఎక్కడెక్కడ కొనుగోలు చేసింది, ఎలక్ట్రానిక్ సహకారం ఎవరి నుంచి పొందారు వంటి విషయాలను తేల్చడానికి ఎన్ఐఎ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నిజాముద్దీన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.