నైజీరియన్ అలియాస్ డా.గోవిందరాజు, 'పెళ్లి' పేరుతో ఆమెను ఎంత వంచించాడంటే?
హైదరాబాద్: నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి సికింద్రాబాద్ కి చెందిన ఓ యువతిని నిలువు దోపిడీ చేశాడు. పెళ్లి పేరుతో ఆమెకు దగ్గరై లక్షల రూపాయలు కాజేశాడు. పెళ్లి పేరుతో అతను చెప్పిన మాయ మాటలకు ఆమె ఊహా ప్రపంచంలో విహరించింది. తనది హైప్రొఫైల్ జాబ్ అని చెప్పడంతో ఇక జీవితానికి ఢోకా ఉండదనుకుంది. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగి సదరు నైజీరియన్ అసలు స్వరూపం బయటపడింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగింది:
సికింద్రాబాద్ కు చెందిన ఓ యువతికి జీవన్ సాథీ అనే ఓ వెబ్ సైట్ లో 2 నెలల క్రితం ఓ నైజీరియన్ పరిచయమయ్యాడు. తనను తాను డాక్టర్ గోవిందరాజుగా పరిచయం చేసుకున్నాడు. తాను నైజీరియన్ అయినప్పటికీ.. తన మూలాలు ఇండియాలోనే ఉన్నాయని, అందుకే భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి తెలిసిన యువతినే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. తన తల్లిదండ్రులు భారతీయులేనని, కానీ అమెరికాలో స్థిరపడ్డారని చెప్పాడు. ప్రస్తుతం తాను ఓ ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్టు నమ్మించాడు.
ఊహల్లో విహరించింది..:
సదరు నైజీరియన్ మాటలను యువతి బాగా నమ్మింది. దీంతో రోజూ అతనితో వాట్సాప్ ద్వారా మాట్లాడేది. ఐక్యరాజ్య సమితి ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం తాను లెబనాన్లో పని చేస్తున్నానని చెప్పాడు. తన తమ్ముడు ఓ పెట్రోలియం కంపెనీలో అత్యున్నత స్థానంలో ఉన్నాడని, తన మూలాలు ఉన్న ఇండియాలోనే తాను స్థిరపడాలనుకుంటున్నట్టు వివరించాడు. పెళ్లి చేసుకున్నాక హైదరాబాద్ లేదా బెంగళూరుల్లో స్థిరపడుదామని కూడా చెప్పాడు. రూ.1కోటితో పెళ్లిని ఘనంగా చేసుకుందామని చెప్పాడు. ఇవన్నీ విని సదరు యువతి ఊహా ప్రపంచంలో మునిగిపోయింది.
డబ్బు పంపిస్తున్నా అని చెప్పి..:
లెబనాన్ లో తాను మరో 2నెలల పనిచేయాల్సి ఉందని ఇటీవల సదరు నైజీరియన్ యువతితో చెప్పాడు. వృత్తిరీత్యా తనకు బోనస్ గా 4.5 లక్షల అమెరికన్ డాలర్లు లభించాయని, వాటిని ఓ పెట్టెలో ఇండియా పంపుతున్నానని చెప్పాడు. తన మిత్రుడు రోజర్ బాకర్ ఆ పెట్టెను, దాని తాళాన్ని తీసుకొచ్చి ఇస్తాడని జాగ్రత్తగా భద్రపరచాలని చెప్పాడు. దీంతో నిజమేననుకున్న యువతి పెట్టెకోసం ఎదురుచూడటం మొదలుపెట్టింది. ఇంతలో రోజర్ బాకర్ పేరుతో ఫోన్ రావడంతో.. నిజంగానే కోట్ల డబ్బు తన వద్దకు వస్తుందని యువతి సంబరపడింది.
రూ.7.5లక్షలు స్వాహా...:
నిజానికి రోజర్ బాకర్ అంటూ ఫోన్ చేసింది సదరు నైజీరియనే. తాను ఢిల్లీ విమానశ్రయంలో చిక్కుకుపోయానని, అధికారులు పెట్టెను స్వాధీనం చేసుకున్నారని ఆమెతో ధీనంగా చెప్పాడు. కస్టమ్ అధికారులకు రూ.1.17లక్షలు చెల్లిస్తే పెట్టె ఇస్తారని, కానీ తన వద్ద అంత డబ్బు లేదని పేర్కొన్నాడు. దీంతో అడిగినంత డబ్బును ఆ యువతి అతని ఖాతాలో జమచేసింది.
మరికాసేపటికి మళ్లీ ఫోన్ చేసిన అతగాడు.. పెట్టెలో డబ్బు ఉందని గుర్తించారని మరో రూ.4.70లక్షలు కట్టాలని చెప్పాడు. చివరగా మరోసారి ఫోన్ చేసి రూ.1.63లక్షలు కడితేనే పెట్టెను తిరిగి ఇస్తారని చెప్పడంతో.. యువతి అంత మొత్తం అతని ఖాతాలో వేసింది. అయితే ఆ తర్వాత అతనికి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే... వెంటనే స్విచ్చాఫ్ వచ్చింది. ఎంత ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో.. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.