పెళ్లి పేరుతో మహిళకు టోకరా ఇచ్చిన నైజీరియన్లు వీరే (పిక్చర్స్)
హైదరాబాద్: సిమ్ప్లీ మ్యారీ వెబ్సైట్తో పరిచయమై ఏడు నెలల చాటింగ్తో మాయ చేసి ఓ మహిళ నుంచి నగదును దోచేసిన 8 మంది నైజీరియన్లను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి పట్టుకొచ్చిన వీరిని మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.
కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన వివాహానికి సంబంధించి వరుడు కోసం సిమ్ప్లీ మ్యాట్రీమోనియల్ వెబ్సైట్లో తన ప్రొఫైల్ను నమోదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆమెకు గ్యారీ ఫిల్స్ పేరుతో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఇలా ఇద్దరు తమ మెయిల్స్ ద్వారా చాటింగ్ చేస్తూ, వివాహం చేసుకుందామని ప్రతిపాదించాడు. దీని కోసం మహిళ కుటుంబ సభ్యులతో కూడా ఛాటింగ్ ద్వారా మాట్లాడాడు.
మధ్యలో మహిళ తన ఫోన్ నెంబరు ఇవ్వాలని అడగగా ఫిల్స్ నిరాకరించాడు. జీ టాక్లో ఛాటింగ్ చేసుకుందామని మాయ చేశాడు. ఈ క్రమంలో తాను ఢిల్లీ మెట్రో పనుల కోసం వచ్చానని, నెల తర్వాత తిరిగి అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్ళిపోతానని వివరించాడు. అయితే, సదరు మహిళ తన సోదరి యూకేలో ఉంటుందని, ఏప్రిల్, జూన్ నెలలో హాలీడేస్ కోసం అక్కడి వెళుతున్నానని, ఫిల్స్ను రమ్మని ఆహ్వానించింది. ఈ ప్రతిపాదనను తప్పించుకునేందుకు ఫిల్స్ పలు కారణాలు చూపుతూ ఇండియాలోనే కలుసుకుందాంమని చెప్పాడు.
విచారణలో ఎనిమిది మందిలో ఒకరు వివాహం చేసుకుంటానని, మిగతా వారు కస్టమ్స్ అధికారులుగా, మరి కొంత మంది ఈశాన్య రాష్ర్టాల్లో బ్యాంక్ ఖాతాలను తెరిచే పనులు చేస్తుంటారని తేలింది. ఎవరైన భారీ నగదు, బంగారం గిఫ్ట్లను ఆఫర్ చేసే అసలు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
నైజీరియన్లు పట్టుకున్నాం
మహిళను పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన 8 మంది నైజీరియన్ల గురించి సైబర్ క్రైం డీసీపీ నవీన్కుమార్ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు.
పట్టుకున్నారని నాటకం
అకస్మాత్తుగా ఇటీవల ఫిల్స్ ఫోన్ చేసి ఇండియాకు వచ్చానని, కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని మహిళకు ఫోన్ చేశాడు.
డిపాజిట్ చేయించాడు..
మన వివాహం కోసం తెచ్చిన నగదు, బంగారాన్ని సీజ్ చేశారని, వాటిని విడిపించుకోవాలని, లేదంటే మన ఇద్దర్నీ అరెస్టు చేస్తారని ఫిల్స్ చెప్పాడు. ఇలా మహిళను భయపెట్టించి, గిఫ్ట్స్ ఆశచూపి పలు అకౌంట్లలో రూ.5.40 లక్షలను డిపాజిట్ చేయించాడు.
ముఠాగా ఏర్పడి..
మెడికల్ వీసా, బిజినెస్ వీసాల మీద వచ్చిన నైజీరియన్లు అమ్రాచుక్వు ఎర్నెస్ట్, సెబాస్టియన్, మార్టిన్, చిబుజోర్, చినేడు పాట్రిక్, ప్రామిస్ సోంపూరిచీ, అడ్నేవర్ ఓలాబాన్జీ, ఉడుమ్నా చుకున్నాలు ఒక ముఠాగా ఏర్పడి ఇదంతా చేసినట్లు డీసీపీ తెలిపారు.
అరెస్టు చేశారు..
బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు ఈ ఎనిమిది మందిని ఢిల్లీలో అరెస్టు చేసి మంగళవారం నగరానికి తీసుకువచ్చి రిమాండ్కు తరలించారు.