ఉద్యోగాల పేరుతో మహిళలను వ్యభిచార కూపంలోకి నెడుతున్న ముఠా
హైదరాబాద్: ఉద్యోగాలిప్పిస్తామని మహిళలను గల్ప్ దేశాల్లోని వ్యభిచార కూపంలోకి నెడుతున్న 9 మంది సభ్యుల ముఠాను హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హజ్ యాత్రకు పంపిస్తామని, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ ముఠా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఆ ట్రావెల్ ఏజెంట్ల ముఠాకు జగదీశ్వర్ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా ఈ ముఠా వ్యవహారాలు నడుపుతోందని చెప్పారు. ముంబైలో కూడా దీని కార్యకలాపాలు ఉన్నాయని అన్నారు.
ఆ ముఠా నుంచి కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నటలు తెలుస్తోంది. విదేశాలకు, హజ్ యాత్రకు పంపిస్తామని ఈ ముఠా 250 మంది పాస్పోర్టులను తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయాలుగా, ఇంటి పనిమనుషులుగా గల్ఫ్ దేశాలకు మహిళలను పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడ నిరక్షాస్యులైన మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారని, లైంగిక వేధింపులకు కూడా గురవుతున్నారని చెప్పారు.
ఐదు లక్షల రూపాయలేసి తాము కొనుక్కున్నామని అక్కడి యజమానులు మహిళలకు చెబుతూ తక్కువ జీతం కూడా ఇస్తున్నారని పోలీసులు అధికారులు చెప్పారు. ముఠా నుంచి తాము 72 పాస్పోర్లులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
చెరువులో పడి ముగ్గురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూర్ మండలం కన్నాపూర్ గ్రామంలో విషాద సంఘటన జరిగింది. కన్నాపూర్ చెరువులో పడి ఇద్దరు బాలికలు, ఒక బాలుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు శవాలకు పంచనామా నిర్వహించి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మృతులను నసీమా(15), రేష్మ(13), ముజాహిద్(16)లుగా గుర్తించారు. మృతులు ఊట్నూర్ ఐబీ ప్రాంత వాసులని పోలీసులు తెలిపారు.