ఐఐటీసీలో దారుణం: గదిలోకి లాక్కెళ్లి మహిళా ఉద్యోగి ముఖంపై ఉమ్మేశారు
హైదరాబాద్: ఉద్యోగుల లోపాలను ఉన్నాతాధికారులకు చెప్పిందనే అక్కసుతో మహిళా ఉద్యోగిపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి మహిళపై అత్యాచారయత్నం చేసిన ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
గత కొంతకాలంగా తనపై జరుగుతున్న వేధింపులను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆ బాధిత మహిళా ఉద్యోగి చివరకు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే హఫీజ్పేటకు చెందిన ఓ వ్యక్తి తార్నాకలోని ఐఐసీటీలో కాంట్రాక్టు ఉద్యోగికిగా పనిచేస్తూ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు.
దీంతో అతని భార్యకు అందులో కాంట్రాక్టు కార్మికురాలి ఉద్యోగం ఇచ్చారు. నవంబర్ 15న ఆమె విధి నిర్వహణలో ఉండగా పై అధికారులు ఆకస్మిక తనిఖీకి వచ్చారు. విధుల్లో ఉండాల్సిన మరో పదిహేను మంది కార్మికులు అక్కడ లేకపోవడంతో అధికారులు ఆమెను అడిగారు.
వారు ఉదయమే వచ్చి వెళ్లిపోయారని, ఇక్కడ అందరికీ సమన్యాయం జరగడం లేదని ఆమె ఉన్నతాధికారులకు తెలిపింది. దీంతో ఆ అధికారులు 15 మందిని బోడుప్పల్, మౌలాలి ప్రాంతాల్లోని ఇతర సంస్థలకు బదిలీ చేశారు.
ఉద్యోగుల గార్డెనింగ్ కోసం ఉన్న ఇన్చార్జి అధికారిని మందలించారు. ఆ తర్వాత ఈ నెల 16న విధులకు హాజరయ్యేందుకు వచ్చిన సదరు మహిళను భాస్కర్ రాజన్, మరో కాంట్రాక్టు ఉద్యోగి ఎండీ యాకూబ్పాషాలు ఆమెను కార్యాయంలో గదిలోకి లాక్కెళ్లారు.
యాకూబ్పాషా ఆమెపై చేతులు వేయగా, భాస్కర్రాజన్ ఆమె చెంపపై కొట్టారు. వారినుంచి ఆమె తప్పించుకుని బయటికి రాగ, ఆమె వెనకాలే వచ్చిన భాస్కర్ రాజన్ నానా దుర్భాషలాడుతూ ముఖంపై ఉమ్మివేశాడు. ఈ విషయాన్ని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.
ఆ మరుసటి రోజు ఆమె విధులకు రాగానే కాంట్రాక్టర్ మురళీ పవార్ ఆమెను పిలిచి మరో చోటికి బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. ఇలా ఆమెను మానసికంగా వేధించారు.