తెలంగాణను భ్రష్టు పట్టించారు: కేసీఆర్ సర్కారుపై నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు పూర్తిగా రుణాల మాయమైందని మండిపడ్డారు. తెలంగాణలో ఆర్థిక నిర్వహణ సరిగా లేదని.. రాబోయే తరాలపై రుణభారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన అంశంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని.. అయితే, ఇప్పటికి పదేళ్లు అయినా ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. తెలంగాణ రాష్ట్రానికే ఎంతో గొప్పదిగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోతున్నాయని విమర్శించారు. అధికారంలోకి రాగానే దళిత వ్యక్తిని సీఎం చేస్తామన్న కేసీఆర్.. ఆ తర్వాత మర్చిపోయారని విమర్శించారు.

ఎస్సీ అయిన తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి ఎంతో గొప్పగా చెప్పి.. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఆ పదవి నుంచి ఆయనను తొలగించారని విమర్శించారు నిర్మలా సీతారామన్. రూ. 3300 కోట్లు బీసీల అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెప్పి.. కేవలం రూ. 77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు. ఆ నిధులన్నీ ఎందుకోసం వాడారో తెలియదన్నారు.
తెలంగాణలో 11 వర్సిటీల పరిధిలో 2 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి నిర్మల తెలిపారు. దేశ వ్యాప్తంగా 72 శాతం అక్షరాస్యత ఉంటే తెలంగాణలో 66 శాతం ఉందని చెప్పారు. జాతీయ సగటు కన్నా ఇది తక్కువ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని.. వదిలేశారని మండిపడ్డారు నిర్మలా సీతారామన్.
తెలంగాణను భష్ట్రు పట్టించారు: కేసీఆర్ సర్కారుపై నిర్మల విమర్శలు
అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని విమర్శించారు నిర్మలా సీతారామన్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విపక్ష నేతలు సైతం కొనియాడుతున్నారన్నారు. రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Before announcing freebies, the financial position of the state must be taken into consideration by the political parties & accordingly a decision should be taken whether fulfilling them is feasible or not.
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) November 21, 2023
Freebies are being announced across many states without taking their… pic.twitter.com/jD3DF67m7z
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని కేంద్రమంత్రి ఆరోపించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని మండిపడ్డారు.
బంగారు తెలంగాణను.. నేడు అప్పుల తెలంగాణ చేశారని కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు నిర్మలా సీతారామన్. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగా పూర్తి కాలేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. హైదరాబాద్ లో ఎప్పట్నుంచో ఉన్న పరిశ్రమలు చూపిస్తున్నారు తప్ప.. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని నిర్మలా సీతారామన్ ఓటర్లను కోరారు.












Click it and Unblock the Notifications