తెలంగాణలో హైవే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా ఉంది: నితిన్ గడ్కరీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన హైవే ప్రాజెక్టులు ట్రైలర్ మాత్రమేనని.. సినిమా ఇంకా మిగిలే ఉందని కేంద్ర మంత్రి గడ్కరి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తరహా హైవేలు తెలంగాణలో నిర్మాణమవుతాయని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలకు అనుసంధానిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ శంషాబాద్లో 12 జాతీయ రహదారుల విస్తరణ పనులకు నితిన్ గడ్కరీ శుక్రవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. జీఎంఆర్ ఎరీనా వద్ద హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి నితన్ గడ్కరీ.. అనంతరం ఇప్పటికే పూర్తయిన రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. ఏడు సీఆర్ఐఎఫ్ ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. రాంసాన్ పల్లి నుంచి మంగళూరు వరకు 4 వరుసల రహదారిని జాతికి అంకితమిచ్చారు. కాగా, రాష్ట్రంలో రూ.8,000 కోట్లకు పైగా వ్యయంతో 460కి.మీ మేర 12 జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే 96 కి.మీల రహదారి పనులు పూర్తయ్యాయి. రూ.1,614 కోట్లతో 47 కి.మీ మేర 4 వరుసల రహదారి నిర్మాణం చేపట్టారు. రూ.4,927 కోట్లతో చేపట్టే.. 258 కి.మీ. హైవేల విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు.
దేశంలో మొత్తం 26 గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నామని గడ్కరీ తెలిపారు. వాటిలో 5 గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలు తెలంగాణ మీదుగా వెళ్తాయని తెలిపారు. 2014 నుంచి 2022 వరకు రూ. 3 లక్షల కోట్లతో హైవేల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ హైవే దేశంలోనే అతి పెద్దదని.. ఈ హైవే ద్వారా ముంబై నుంచి ఢిల్లీకి 12 గంటల్లోనే చేరుకుంటామని వెల్లడించారు. తెలంగాణలో 2014లో 2,511 కి.మీ మేర హైవేలు మాత్రమే ఉండేవని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 4,996 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు గడ్కరీ. ఎనిమిదేళ్లలో తాము మరో 2,450 కి.మీ హైవేల నిర్మించామన్నారు. రానున్న రోజుల్లో మరింత వేగంగా హైవేల నిర్మాణం చేపడతామని, ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అద్భుతంగా రహదారుల నిర్మాణం జరుగుతోందని అన్నారు. నితిన్ గడ్కరీ నేతృత్వంలో దేశంలో హైవేల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పెర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడున్నరేళ్లలో వందశాతానికిపైగా రోడ్ల నిర్మాణం జరిగిందన్న కిషన్ రెడ్డి.. రహదారుల కోసం రూ.1.04 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు పెడుతోందని తెలిపారు.
"హైదరాబాద్కు రావాలంటే ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంటుంది. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది. ఉత్తర ప్రాంతానికి సంబంధించి రూ.10 వేల కోట్లతో 182 కి.మీ రోడ్డు నిర్మాణం చేపట్టాం. దేశంలోని అన్ని రాష్ట్రాలు మోదీ ప్రభుత్వానికి సమానమే. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సైతం కేంద్రం కృషి చేస్తోంది. జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు.
ఇది ఇలావుండగా, శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రసంగానికి ఆటంకం కలిగింది. ప్రశాంత్రెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ శ్రేణులు జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేయడంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. దీంతో కిషన్రెడ్డి జోక్యం చేసుకొని కార్యకర్తలను వారించారు. అధికారిక కార్యక్రమంలో నినాదాలు వద్దని బీజేపీ శ్రేణులను ఆయన కోరారు. దీంతో కాస్త శాంతించారు. ఆ తర్వాత మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే, సమావేశం అనంతరం బీజేపీ శ్రేణులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని మండిపడ్డారు.