చర్చనీయాంశం: ఎంపీ కవితకు బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయింపు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో శనివారం ఆమె మాట్లాడుతూ ప్రధాని మోడీ హైదరాబాద్కు ఏదో చేస్తాడని బీజేపీ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీని ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. ప్రభుత్వ పథకాల్లో ఎంతో మంది ఆంధ్రా వారు లబ్ధిపొందారని తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.
మరోవైపు నిజామాబాద్ ఎంపీ కవితకు తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. భద్రతా కారణాల రీత్యానే ఆమెకు బుల్లెట్ ప్రూఫ్ కారును సర్కారు కేటాయించిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఓ ఎంపీకి బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.