కేసీఆర్ 'డబుల్'కు డబ్బుల్ లేవు! 'అటకెక్కించేందుకే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ కూడా ఉంది. అయితే, ఈ పథకానికి పలు ఇబ్బందులు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒక్కో డబుల్ బెడ్ రూంకు రూ.3.5 లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందట.
అయితే, 490 స్కేర్ యార్డ్స్లలో డబుల్ బెడ్ రూం నిర్మించాలంటే తక్కువలో తక్కువ ఐదు లక్షలు అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 490స్కేర్ యార్డ్స్లలో కాకుండా డబ్బులు తక్కువయ్యేందుకు అంతకంటే తక్కువ స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందంటున్నారు.

దీని పైన కూడా అధికారులు పెదవి విరుస్తున్నారట. 490 స్కేర్ యార్డ్స్ కంటే తక్కువ స్థలం ఉంటే డబుల్ బెడ్ రూం, టాయిలెట్, కిచెన్ తదితరాలు నిర్మించలేమని చెబుతున్నారు. సోమవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఫుల్ ఫిల్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఈ పథకానికి కేంద్రం సహకరిస్తే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన పేరునే పెట్టేందుకు కూడా తెరాస ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.5 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మిగతా మొత్తాన్ని కేంద్రాన్ని ఆఢగాలనుకుంటోంది. అంతేకాకుండా డబుల్ బెడ్ రూంకు లబ్ధిదారులు రూ.లక్ష కట్టాలని షరతు విధించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
డీకే అరుణ మండిపాటు
తెరాస ప్రభుత్వం షరతుల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మంగళవారం హైదరాబాదులో నిప్పులు చెరిగారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.లక్ష కట్టాలని షరతు విధించడం సరికాదన్నారు. పేదలు రూ. లక్ష కట్టలేకపోతే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేయరా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
ఈ పథకాన్ని అటకెక్కించే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం షరతులు విధిస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో మంజూరైన బిల్లులను కూడా పెండింగులో పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని సవాల్ చేశారు. కొత్త రాష్ట్రంలో కొత్త ఒరవడి ఉండాలంటున్న కేసీఆర్.. తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి, ఆమోదింప చేసి, ఎన్నికలకు వెళ్లాలన్నారు.












Click it and Unblock the Notifications