10 వేల బెడ్లకు ఆక్సిజన్ ఇస్తామన్న తెలంగాణ సర్కారు: అసలు ఎలా సాధ్యం? స్పష్టతేది?
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో దేశంలో పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, ఇదే సమయంలో తెలంగాణ సర్కారు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో 10వేలకుపైగా బెడ్లకు ఆక్సిజన్ అందిస్తామని ఇటీవల ప్రకటించింది. ఆక్సిజన్ లైన్స్ ద్వారా అందిస్తామని చెప్పటినప్పటికీ.. ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు పడకపోవడం గమనార్హం.
ఇప్పుడున్న పేషెంట్లకే ఆక్సిజన్ కష్టం..
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 10వేల బెడ్లకు ఆక్సిజన్ అందించాలంటే దాదాపు 146 మెట్రిక్ టన్నులకుపైగా ఆక్సిజన్ ఒక రోజుకు అవసరం అవుతుంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం ఒక బెడ్కి గంటకు 7.14 లీటర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుంది.
ఇక ఐసీయూ బెడ్లకు గంటకు 11.9 లీటర్ల ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది. అంటే తెలంగాణలో ప్రస్తుతం ఒక రోజుకు 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుంది. ప్రస్తుతం ఉన్న కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ ఇవ్వడమే కష్టంగా ఉంది. ఒడిశా నుంచి ఇటీవలే వాయుసేన విమానాలను ఉపయోగించుకుని ఆక్సిజన్ను తెలంగాణ సర్కారు తెప్పించుకుంది.
10వేల బెడ్లకు రోజుకు 146 మెట్రిక్ టన్నుల ఆక్సిజన అవసరం
కేంద్ర వైద్యారోగ్య కుటుంబస సంక్షేమ శాఖ అందించిన డేటా ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో కేవలం రెండు ప్రైవేటు ప్లాంట్లు మాత్రం రోజుకు 101 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నాయని తెలిసింది. దీన్ని లెక్కలోకి తీసుకుంటే రాష్ట్రం రోజుకు 159 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటోంది. అదనంగా మరో 10వేల బెడ్లకు ఆక్సిజన్ కావాలంటే సుమారు 146 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఇంత భారీ స్థాయిలో ఆక్సిజన్ అవసరాన్ని తెలంగాణ సర్కారు ఎలా తీరుస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణకు ఆక్సిజన్ నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా లేదు
రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజ్ నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆక్సిజన్ లభ్యత పరిమితంగా ఉండగా, నిల్వ సమస్య కూడా ఉంది. 50వేల మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కోసం కేంద్రం ప్రభుత్వం ఇటీవల టెండర్ విడుదల చేసింది. అయితే, తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క ఆక్సిజన్ ప్లాంటులో కేవలం 55 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంది.
కేంద్రం భారీ స్థాయిలో కేటాయించినా రాష్ట్రంలో నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ సామర్థ్యం కావడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు.. 270 మెట్రిక్ టన్నులు, 456 మెట్రిక్ టన్నులు, 1192 మెట్రిక్ టన్నుల అదనపు లిక్విడ్ ఆక్సిజన్ నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది.