తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ నామమాత్రమే: తెరుచుకున్న బ్యాంకులు
పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా విపక్షాలు సోమవారం చేపడుతున్న భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రంగా సాగుతోంది.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా విపక్షాలు సోమవారం చేపడుతున్న భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రంగా సాగుతోంది. బంద్లో పలు కార్మిక సంఘాలు భాగస్వామ్యం కాకపోవడంతో ప్రభావం అంతంగా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సీపీఐ, సీపీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాయి.
కాంగ్రెస్ పార్టీ నేతలు భారత్ బంద్లో పాల్గొనబోమని, ఆక్రోశ్ దివస్గా నిరసనలు చేపడతామని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు, ఆందోళనలకు మాత్రమే పరిమితమయ్యాయి.
భారత్ బంద్ ఇచ్చిన విపక్షాలు.. బ్యాంకులు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు నివ్వడంతో బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కాగా, తెలంగాణ, ఏపీల్లో ఆర్టీసీ బస్సులు కూడా సోమవారం ఉదయం నుంచే తిరుగుతున్నాయి. ఖమ్మం, మధిరలో మాత్రం ఉదయం వామపక్షాల ఆందోళనతో కాసేపు బస్సులు నిలిచిపోయాయి.
ఆర్బీఐ ఎదుట కాంగ్రెస్ ధర్నా
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ నగరంలోని ఆర్బీఐ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించి ఆందోళనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, వి హనుమంతరావు, దానం నాగేందర్, షబ్బీర్ అలీ, తదితర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లధనంపై పోరుకు మేం వ్యతిరేకం కాదని అన్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణయం తీసుకుందని అన్నారు. నల్లధనం ఉన్నోళ్లంతా బాగానే ఉన్నారు, సామాన్యులే ఇబ్బందులు పడుతున్నారని షబ్బీర్ అలీ అన్నారు.
జనసేన ఆందోళన
విజయవాడలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రజల ఇబ్బందులను తొలగించాడని డిమాండ్ చేశారు. పలు జిల్లాల్లో వామపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి.
ఇక దేశం విషయానికొస్తే ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ వద్ద సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది. కేరళ, పశ్చిమబెంగాల్ మినహా మరే ఇతర రాష్ట్రాల్లో బంద్ ప్రభావం అంతగా లేనట్లే తెలుస్తోంది.