అసెంబ్లీలో మాకు టిఫిన్ తినేందుకు గది కూడా లేదు: ఈటల రాజేందర్, మంత్రుల కౌంటర్
అసెంబ్లీలో ప్రతిపక్ష శాసనసభ్యులమైన తమకు సరైన గౌరవం లభించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీకి వచ్చిన తమకు టిఫిన్ చేసేందుకు కూడా సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: అసెంబ్లీలో ప్రతిపక్ష శాసనసభ్యులమైన తమకు సరైన గౌరవం లభించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీకి వచ్చిన తమకు టిఫిన్ చేసేందుకు కూడా సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యేకు ఇది అవమానమని అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.
బడ్జెట్ కంటే ముందు మాకు రెండు సమస్యలు ఉన్నాయని ఈటల తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ సభ్యులకు వసతి కల్పించట్లేదని చెప్పారు. బీజేపీ సభ్యులకు టిఫిన్ చేసేందుకు కూడా అవకాశం లేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ తినేందుకు కూడా అవకాశం లేదు. దీనిపై మీకు చాలా విజ్ఢప్తి చేశాం. ఇది తనను అవమానించడం కాదు. శాసనసభ్యులను అవమానించడం అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

అయితే, ఈటల మాటలను మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు. బడ్జెట్పై చర్చించే సమయంలో సదుపాయాలపై మాట్లాడటం తగదని అన్నారు. అలాంటి అంశాలను సభాపతి కార్యాలయానికి వెళ్లి విజ్ఞప్తి చేయాలని హరీశ్ రావు సూచించారు. మరోవైపు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసారి శ్రీనివాస్ యాదవ్ లు కూడా జోక్యం చేసుకుని ఈటలకు శాసనసభ సంప్రదాయాలను వివరించారు.
ఇది ఇలావుండగా, అసెంబ్లీ, శాసనమండలిలో తెలంగాణ బడ్జెట్ పై సాధారణ చర్చ ప్రారంభమైంది. మొదటగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటోందని విమర్శించారు. విభజన చట్ట ప్రకారం తెలంగాణకు నిధులు రావట్లేదన్నారు. బడ్జెట్ అంచనాల్లో 20 శాతం లోపు మాత్రమే గ్రాంట్ ఎయిడ్ వస్తోందని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి రెండు విభజిస్తున్నారని ఆరోపించారు. అదానీ అనే వ్యాపారి దేశసంపదను లూటీ చేస్తున్నారని భట్టి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications