కరోనా : హైదరాబాద్లో ఆ ఇద్దరికీ ఎలా సోకినట్టు.. వైద్యులకే షాక్...
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనను పెంచుతోంది. సోమవారం(ఏప్రిల్ 13) ఒక్కరోజే రాష్ట్రంలో 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు హైదరాబాద్లోనే నమోదవుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఆశ్చర్యంగా మర్కజ్ హిస్టరీ గానీ,విదేశీ ట్రావెల్ హిస్టరీ గానీ లేని ఇద్దరు హైదరాబాద్ వాసులకు కరోనా పాజిటివ్గా తేలడం వైద్యులనే షాక్కి గురిచేసింది. దీంతో ర్యాపిడ్ టెస్టులను పెంచాల్సిన అవసరం ఏర్పడింది.
ఎలా సోకినట్టు... డాక్టర్లే షాక్..
తాజాగా పాజిటివ్గా తేలిన వ్యక్తుల్లో హైదరాబాద్ గాంధీనగర్కి చెందిన వ్యక్తి(48) ఒకరున్నారు. కొంతకాలంగా పక్షవాతంతో అతను మంచానికే పరిమితమయ్యాడు. కాళ్లు, చేతులు పని చేయడం లేదు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. వాళ్లలో ఎవరికీ విదేశాలకు గానీ,మర్కజ్ లాంటి ప్రాంతాలకు వెళ్లి వచ్చిన హిస్టరీ గానీ లేవు. అయినా సరే ఆ వ్యక్తికి పాజిటివ్గా తేలడం వైద్యులనే షాక్కి గురిచేసింది. దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి వైద్య పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది.
మరో చిన్నారికీ అలాగే..
తాజా కేసుల్లో టోలీచౌకీ(8)కి చెందిన బాలికకు కూడా పాజిటివ్గా తేలింది. ఆ చిన్నారికి లేదా ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి విదేశీ ట్రావెల్ హిస్టరీ గానీ,మర్కజ్ హిస్టరీ గానీ లేదు. కరోనా పాజిటివ్ పేషెంట్లతో కాంటాక్ట్ హిస్టరీ కూడా ఏమీ లేదు. ఉన్నట్టుండి దగ్గు,జలుబు,జ్వరం రావడంతో చికిత్స కోసం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఆమె శాంపిల్స్ను పరీక్షంచగా పాజిటివ్ అని తేలింది. దీంతో బాలికకు వైరస్ ఎలా సోకిందో అంతుచిక్కడం లేదు.
విదేశీ,మర్కజ్ హిస్టరీ ఉన్నవారికి..
ప్రభుత్వం,అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటివరకు విదేశీ,మర్కజ్ హిస్టరీ ఉన్నవారికి.. వారి , ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్నవారికి మాత్రమే వైరస్ సోకింది. కానీ తాజా కేసుల్లో ఇవేవీ లేనివారికి కూడా పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటివారు ఇంకెంతమంది ఉన్నారన్నది మరింత ఆందోళన కలిగిస్తోంది. కొంతమందిలో లక్షణాలు కూడా బయటపడకపోతుండటంతో.. వారు బయట తిరిగే పరిస్థితి కూడా ఉంది. దీంతో వారు తుమ్మినప్పుడో,దగ్గినప్పుడో ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాస్కులు ధరించడం తప్పనిసరిగా పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
అనూహ్యంగా పెరుగుతున్న కేసులు
విదేశాల నుంచి తెలంగాణకు వచ్చి కరోనా పాజిటివ్గా తేలిన 30 మంది,వారి ద్వారా వైరస్ సోకిన మరో 20 మంది క్వారెంటైన్ ముగియడంతో వారంతా ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. ఇక మర్కజ్ వెళ్లి వచ్చిన 1200 మందిని గుర్తించి.. వారి కాంటాక్ట్స్ మరో 3500 మందిని గుర్తించి క్వారెంటైన్ చేశారు. వీరిలో 172 మందికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం 1600 మంది క్వారెంటైన్లో ఉన్నారు. ఇందులో కొందరి క్వారెంటైన్ కూడా త్వరలోనే ముగియనుంది. ఎవరి పరిస్థితి విషమంగా లేకపోవడంతో దాదాపుగా నెగటివ్ రిపోర్టులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇంతలోనే కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం లాక్ డౌన్ పొడగింపు నిర్ణయం సరైందనే భావన కలిగిస్తోంది.
హైదరాబాద్లో 17 జోన్లు
సోమవారం నాటికి రాష్ట్రంలో 592 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 103 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో నగరంపై ప్రత్యేదృష్టి కేంద్రీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ను 17 జోన్లుగా విభజించి ఒక్కో జోన్ను యూనిట్గా పరిగణించి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ జోన్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
Recommended Video