ఖైరతాబాద్ గణేష్ చేతిలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లడ్డూ!? తాపేశ్వరం మల్లిబాబు అలక, అసలేమైంది?
ఏడేళ్లుగా ఖైరతాబాద్ లోని భారీ గణపతి కోసం అంతే భారీస్థాయిలో లడ్డూ తయారుచేస్తున్నారు. అయితే ఈ సంప్రదాయానికి ఈ ఏడాది బ్రేక్ పడనుంది. కారణం.. ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకుల తీరుపై లడ్డూ తయారీదారు అలగడమేనని
హైదరాబాద్: వినాయకుడి లడ్డూకున్న ప్రాశస్త్యమే వేరు! ఇక.. రాష్ట్రంలోనే ప్రసిద్ధిపొందిన ఖైరతాబాద్ గణనాథుడి లడ్డూనైతే ప్రసాదంగా స్వీకరించేందుకు భక్తులు పోటీపడతారు. ఏడేళ్లుగా ఈ భారీ గణపతి కోసం అంతే భారీస్థాయిలో లడ్డూ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి వస్తోంది.
అయితే.. ఈ సంప్రదాయానికి ఈ ఏడాది బ్రేక్ పడనుంది. కారణం.. ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకుల తీరుపై లడ్డూ తయారీదారు అలగడమేనని సమాచారం. తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు.. 2010 నుంచి ఖైరతాబాద్ గణేశుడి కోసం భారీ లడ్డూను నైవేద్యంగా పంపుతున్నారు.
కొంత తను తీసుకుని...
ఏటికేడు లడ్డూ బరువును పెంచుకుంటూ.. 2015లో ఏకంగా 6 వేల కేజీల లడ్డూను పంపించారు సురుచి ఫుడ్స్ మల్లిబాబు. అయితే.. గణేష్ ఉత్సవాల అనంతరం మల్లిబాబు తాను సమర్పించిన లడ్డూలో కొంత భాగాన్ని ప్రసాదంగా తీసుకునేవారు. మిగతా లడ్డూను నిర్వాహకులు భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేవారు.
Recommended Video
2013లోనే మొదలైన సమస్య...
2013లోనే సమస్య మొదలైంది. అప్పట్లో 4,200 కిలోల లడ్డూను మల్లిబాబుకు పంపించగా, గణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత మల్లిబాబుకు కొంత ఇచ్చి.. మిగతాది భక్తులకు పంచాలని నిర్ణయించారు. అయితే లడ్డూ పంపిణీలో వాటాపై కమిటీ సభ్యుల్లో గొడవ జరగడంతో పోలీసులు పంపిణీని నిలిపేశారు. ఇంతలో భారీ వర్షం పడటంతో లడ్డూ కాస్తా చెడిపోయింది.
లడ్డూ ప్రసాదం దోపిడీ...
2015లో మల్లిబాబు తనవంతుగా తీసుకున్న లడ్డూను తాపేశ్వరానికి తరలిస్తుండగా కొందరు దౌర్జన్యం చేసి లడ్డూ ప్రసాదాన్ని బలవంతంగా తీసుకున్నారు. 2016లో లడ్డూను తీసుకురావద్దని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులే మల్లిబాబుకు చెప్పారు.
2016లో వద్దన్నా తీసుకొచ్చి...
కానీ ఆయన భక్తిభావంతో ఆ ఏడాది 500 కిలోల లడ్డూను తెచ్చి.. గణపతి పాదాల వద్ద సమర్పించారు. అయితే, నిమజ్జనం అయ్యాక ఆ లడ్డూలో రవ్వంత కూడా మల్లిబాబుకు ఇవ్వకపోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు.
ఈ ఏడాది లడ్డూ రాదు...
ఇక ఈ ఏడాది కూడా తాపేశ్వరం మల్లిబాబును గణేష్ ఉత్సవ కమిటీ సంప్రదించక పోవడంతో ఆయన లడ్డూ సమర్పించడం లేదని ప్రకటించారు. ఈసారి 5 కిలోల లడ్డూలను రెండు తీసుకొచ్చి పూజ అనంతరం ఒక లడ్డూను తాను తీసుకెళ్తానని ఆయన తెలిపారు.
ప్రత్యామ్నాయంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లడ్డూ...
అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అసలైన లడ్డూకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ గణనాథుడి చేతిలో లడ్డూ స్థానంలో శిల్పి రాజేంద్రన్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో అచ్చం తాపేశ్వరం లడ్డూలాంటిదే తయారు చేస్తున్నట్లు సమాచారం.