ఆర్టీసీ కార్మికులతో చర్చల్లేవ్...! వందశాతం ఏర్పాట్లు చేయండి : సీఎం కేసీఆర్
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. సమ్మెలో ఉన్న కార్మీకులతో ఎలాంటీ చర్చలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. చట్టవిరుద్దంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గుర్తించదని అన్నారు. తమంతట తాముగా విధులకు గైర్హాజరైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సిఎం ప్రకటించారు. సమ్మెలో పాల్గొనకుండా, విధులు నిర్వర్తిస్తున్న వారికి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
మూడు రోజుల్లో పూర్తి స్థాయి బస్సులు
సమ్మెపై ఆర్టీసీ ఐకాస కార్యాచరణ ప్రకటించడంతో ప్రభుత్వం కూడ అదే స్థాయిలో తమ నిర్ణయాలను ప్రకటించింది. అధికారులు, మంత్రులతో ఆర్టీసీ సమ్మెపై చర్చించిన సీఎం కేసీఆర్ అనంతరం పలు నిర్ణయాలను ప్రకటించారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల్లోనే వందశాతం బస్సులు నడపేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇప్పటికే నిర్ణయించిన విధంగా 50 శాతం ఆర్టీసీ బస్సులు నడపడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని, 30 శాతం బస్సులను అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వాలని అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
కార్మీకులను క్షమించే ప్రసక్తే లేదు
యూనియన్ నాయకుల పిచ్చిమాటలు నమ్మి కార్మికులు అనధికారికంగా గైర్హాజరయి, తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారని కేసీఆర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి దింపారని మండిపడ్డారు. యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి తీసుకునే అవకాశమే లేదని ఖరాఖండిగా చెప్పారు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అన్నారు. ఈ సంధర్భంగా పండగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్టీసీని నష్ట పరిచిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదని అన్నారు. అసలు కార్మీకులు చేస్తున్నది సమ్మె కానే కాదని చెప్పారు. సమ్మె విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
బందోబస్తును పెంచండి
మరోవైపు కార్మీకుల ఆందోళనలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రతీ ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును పెంచండి అంటూ డీజీపీకి ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ఇక అన్ని చోట్ల సిసి కెమెరాలు పెట్టడంతోపాటు . మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆందోళణపై నిఘాను పెంచడంతో పాటు బస్సులను ఆపి, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని చెప్పారు... ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేకుండా వ్యవహరించాలని రాష్ట్ర డిజిపిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
బీజేపీపై మండిపడ్డ కేసీఆర్
ఆర్టీసీ కార్మీకులకు మద్దతు పలుకుతూ ధర్నా కొనసాగించడంపై సీఎం మండిపడ్డారు. బీజేపి నాయకులు ఇక్కడ బాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైల్వేలతో పాటు ఇండియన్ ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరించిందని అన్నారు. చివరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా ప్రైవేటీకరించిందని విమర్శించారు. రైల్వేలతో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించు కోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోలోనే చెప్పిందని. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తుంటే, ఇక్కడి ఆ పార్టీ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రవాణ వ్యవస్థ విలీనం చేసిన విధానాలు లేవని అన్నారు.