ఓటుకు నోటు రివర్స్, గ్రేటర్పై బాబు-కెసిఆర్ దోస్తీ ఎఫెక్ట్!: పవన్ కళ్యాణ్ని అడగగలరా?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి ప్రభావం అంతంత మాత్రంగానే ఉండనుందా? అనే చర్చ సాగుతోంది. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, చంద్రబాబు - కెసిఆర్ దోస్తీ, వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు, తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను తరిచి చూస్తున్న వారు అవుననే అంటున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని జిల్లాల్లో టిడిపి - బిజెపి మిత్రపక్షాలు సీట్లు సాధించనప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సత్తా చాటాయి. కాంగ్రెస్, టిఆర్ఎస్కు షాకిస్తూ సగానికి పైగా సీట్లు బిజెపి - టిడిపి గెలుచుకుంది.
అయితే, తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలోని టిడిపి నేతలు కారు ఎక్కుతున్నారు. దానికి తోడు రేవంత్ రెడ్డి - ఓటుకు నోటు అంశం ఆ పార్టీకి తెలంగాణలో పెద్ద కుదుపు. అంతకుముందు టిడిపి నేతలు తెరాసలో చేరినప్పటికీ... ఓటుకు నోటు అంశమే ఆ పార్టీకి పెద్ద మైనస్గా చెబుతున్నారు.
నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు ఓటుకు నోటును తెరపైకి తీసుకు వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఆ తర్వాత కూడా టిడిపి నుంచి చాలామంది టిడిపి నేతలు తెరాసలో చేరారు. ఎమ్మెల్యేలు కూడా ఉండటం గమనార్హం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాదులో సత్తా చాటిన టిడిపి.. ఇప్పుటు గ్రేటర్ ఎన్నికలు వస్తే కుదేలయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు.
అందుకు, కొందరు టిడిపి ఎమ్మెల్యేలు కారు ఎక్కడం, ఓటుకు నోటు.. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు. వీటితో పాటు చంద్రబాబు తెలంగాణను వదిలేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవి కూడా ఆ పార్టీకి నష్టం చేస్తున్నాయని అంటున్నారు.
చంద్రబాబు మాటలో, చేతలో తెలంగాణను పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదని అంటున్నారు. తరిచి చూస్తే.. ఓటుకు నోటు ప్రభావం తెలుగుదేశం పార్టీ పైన బాగానే పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
గతంలో వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో టిడిపి - బిజెపి రెండో స్థానంలోనైనా నిలుస్తుందని భావించారు. కానీ అది మూడోస్థానానికి పడిపోయింది. అప్పుడే టిడిపి నేతలు మాట్లాడుతూ... వరంగల్లో తమ పార్టీ అభ్యర్థి పోటీ చేసి ఉంటే గెలిచేవాళ్లమని, బిజెపికి పట్టులేదని చెప్పారు.
కాగా, తాజాగా రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ సత్తా చూపలేకపోయింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీకి పట్టు ఉంది.
నామా నాగేశ్వర రావు, రేవంత్ రెడ్డి వంటి కీలక నేతలు ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్లో టిడిపి సత్తాచాటింది. ఇలాంటి మెరుగైన చోటనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గట్టెక్కలేకపోయింది. పైగా, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు గెలుచుకుంది.
మొత్తం 12 స్థానాలకు తొలుత ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. టిఆర్ఎస్ నాలుగు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలిచింది. కానీ టీడీపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. పాలమూరులో కొత్తకోట దయాకర్ రెడ్డి వంటి నేత కూడా ఓడిపోయారు.
తొలి నుంచి బిజెపికి భయమే
తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని తెలంగాణ బిజెపి మొదటి నుంచి చెబుతోంది. ఇప్పుడు మరింత బలంగా అధిష్టానం వద్ద వాదించే అవకాశం దానికి దొరికింది. గ్రేటర్ ఎన్నికల్లోను టిడిపితో కలిసి పోటీ చేసే విషయమై బిజెపి పునరాలోచించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ను ఏం అడుగుతారు?
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినా టిడిపి - బిజెపిలు కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మద్దతి ఇవ్వవచ్చుననే ఊహాగానాలు మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు వరుస ఓటముల నేపథ్యంలో టిడిపి నేతలు ప్రచారం కోసం పవన్ను అడిగే ధైర్యం చేయగలరా అని అంటున్నారు. ఆయన కూడా ప్రచారానికి మొగ్గు చూపించకపోవచ్చునని భావిస్తున్నారు.