నిర్ణయం మార్చుకున్న షర్మిల...?-నిరాడంబరంగానే పార్టీ ఆవిర్భావం-లోటస్ పాండ్ నుంచే..?
'తెలంగాణలో రాజన్న రాజ్యం...' నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల జులై 8న పార్టీని స్థాపించబోతున్న సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని భావించిన షర్మిల... ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ విధానంలోనే పార్టీ పేరు,జెండా,ఎజెండాను ప్రకటించాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. దీంతో షర్మిల మద్దతుదారులు,వైఎస్సార్ అభిమానులు ఒకింత డీలా పడ్డట్టు ప్రచారం జరుగుతోంది.
Recommended Video
బహిరంగ సభ నిర్వహించాలని భావించినప్పటికీ...
నిజానికి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం లేదా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ద్వారా పార్టీని ప్రకటించాలని వైఎస్ షర్మిల భావించారు. కానీ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం భారీ సభలకు అనుమతించే అవకాశం లేదు. దీంతో వర్చువల్ పద్దతిలోనే పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించాలని షర్మిల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని బిగ్ స్క్రీన్పై ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
లోటస్ పాండ్ నుంచే...?
బహిరంగ సభ వద్దని భావిస్తుండటంతో లోటస్ పాండ్లోని తన నివాసం నుంచే షర్మిల పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని ముఖ్య నేతలందరూ ఈ కార్యక్రమానికి హాజరవనున్నట్లు తెలుస్తోంది. అట్టహాసంగా జరగాల్సిన ఈ కార్యక్రమం కేవలం కొద్దిమంది సమక్షంలో నిరాడంబరంగా జరగాల్సి రావడం షర్మిల మద్దతుదారులు,వైఎస్సార్ అభిమానులను అసంతృప్తికి గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించి ఉంటే కార్యకర్తల్లో జోష్ పెరిగేదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కార్యకర్తల్లో అసంతృప్తి..
కేవలం 17 లోక్సభ నియోకజవర్గ కేంద్రాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం ద్వారా... క్షేత్ర స్థాయిలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లలేమని కార్యకర్తలు వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ ఆవిర్భావ వేళ కీలక నేతలెవరూ చేరుతున్నట్లు ఇప్పటికైతే సమాచారం లేదు. కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరిగినప్పటికీ... ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. జనాకర్షణ ఉన్న నాయకులు పార్టీలో చేరితే తప్ప ఆవిర్భావ కార్యక్రమం అంతగా హైలైట్ కాకపోవచ్చునని కార్యకర్తలు వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఖమ్మం సంకల్ప సభను భారీ స్థాయిలో నిర్వహించాలని ప్లాన్ చేసిన షర్మిల... చివరకు కేవలం ఐదారు వేల మందితో అనుకున్నంత స్థాయిలో సభను నిర్వహించలేకపోయారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని కూడా నిరాడంబరంగానే నిర్వహించబోతుండటం గమనార్హం.
తనదైన ముద్ర వేయాలనుకుంటున్న షర్మిల
వైఎస్ షర్మిల పార్టీకి వైఎస్సార్ టీపీ అనే పేరును ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. జులైన 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా షర్మిల పార్టీని స్థాపించబోతున్నారు. పార్టీ ఆవిర్భావ సభతో షర్మిల రాజకీయ ప్రయాణం,ఆమె ఎజెండాపై మరింత స్పష్టత రానుంది. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా షర్మిల ప్రభుత్వంపై వాడి వేడి వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. ఇటీవలే జిల్లాల పర్యటన చేపట్టి అన్నదాతల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంతకుముందు,కొలువుల దీక్ష పేరుతో ఉద్యోగాల నోటిఫికేషన్లకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాగైనా సరే,తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని షర్మిల ఉవ్విళ్లూరుతున్నారు.