తెలంగాణలో ఏపీ సర్కార్ దూకుడు పెంచిందా? టీఆర్ఎస్ ఫిర్యాదుపై ఈసీ నిర్ణయమేంటి?
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ మంత్రాంగం పారట్లేదా? ఎన్నికల సంఘం గులాబీ నేతల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదా? ఇలాంటి ప్రశ్నలకు ఆ పార్టీ నేతల పెదవి విరుపులే సమాధానంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల వేళ ఇక్కడి ప్రాంతంలో ఏపీ సర్కార్ టీవీల్లో, పేపర్లలో యాడ్స్ ఇస్తోందనేది టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. అయితే దీనిపై ఎన్నికల సంఘం ఇప్పటివరకు స్పందించలేదు.
దీంతో ఆ పార్టీ నేతలు ఇటు ఈసీ అధికారులను ఏమనలేక.. టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రలో పాలన చూసుకోకుండా చంద్రబాబు నాయుడుకు ఇక్కడేం పని అంటూ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంలా నిలుస్తున్నాయి. అంతేకాదు బహిరంగ సభల్లో మాటల తూటాలు పేలుస్తున్నారు.
తెలంగాణలో ఆంధ్ర యాడ్స్ ఏంటి?
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణలో ఏపీ సర్కార్ కు సంబంధించిన యాడ్స్ టీవీలు, పేపర్లలో వస్తున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఈ ప్రకటనల సంఖ్య తక్కువగా కనిపించినా.. ఎలక్షన్లు సమీపిస్తున్నకొద్దీ వాటి సంఖ్య పెరిగినట్లు అంచనా. ఈ యాడ్స్ ఓటర్ల మీద ప్రభావం చూపొచ్చనే కారణంగా టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తెలంగాణలో ఆంధ్ర ప్రభుత్వం ప్రకటనలివ్వడమేంటని ఫిర్యాదు చేశారు. వీరి కంప్లైంట్ పై ఈసీ ఇంతవరకు స్పందించలేదు. ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు.
అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్టాట్యూ ఆఫ్ యూనిటీ - సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి సంబంధించిన యాడ్ టీవీల్లో బాగా వేయిస్తోంది. అయితే దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా.. ఇలాంటి యాడ్స్ ఓటర్లపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయనే టాక్ వినిపిస్తోంది.
ఓటర్ల ఫిర్యాదులకు ఫటాఫట్ రెస్పాన్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ "సీ-విజిల్" యాప్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రజలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు. ఓటర్లను ప్రభావితం చేయడం, డబ్బుల పంపిణీ ఇలా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులైనా ఇవ్వొచ్చు. ఈ యాప్ కు ఓటర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే చాలామంది దీని ద్వారా ఈసీకి ఫిర్యాదులు చేశారు. వాటిలో చాలావాటికి అధికారులు రెస్పాండ్ అయ్యారు. తగిన చర్యలు తీసుకున్నారు.
"పింక్ బూత్" లపై ఈసీ శీఘ్ర నిర్ణయం.. కాంగ్రెస్ సక్సెసా?
సాధారణంగా ఎన్నికల్లో మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తారు. ఆ పోలింగ్ సెంటర్లన్నీ గులాబీమయంగా ఉంటాయి. పింక్ బూత్ లేదా సఖి బూత్ అని పిలిచే ఈ పోలింగ్ సెంటర్లకు గులాబీ రంగు వాడతారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ "పింక్ రంగు" టీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశంగా భావించారు కాంగ్రెస్ నేతలు. దీంతో మహిళా పోలింగ్ బూత్ లలో పింక్ రంగు వాడొద్దంటూ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ రంగు వాడొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కాంగ్రెస్ ఫిర్యాదులపై స్పందించిన ఈసీ.. టీఆర్ఎస్ ఫిర్యాదును మాత్రం పక్కనబెట్టిందనేది గులాబీనేతల ఆరోపణ.