తెలంగాణ పసుపు రైతులకు కేంద్రం షాక్... టర్మరిక్ బోర్డు ఆలోచన లేదన్న కేంద్రం...
పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిజామాబాద్ రైతన్నల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్ఠం చేసింది. నిజామాబాద్లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం కేంద్ర వాణిజ్యశాఖ, స్పైసెస్ బోర్డు రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. పసుపు, ఇతర సుంగధ ద్రవ్యాల ఎగుమతికి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో బోర్డు కార్యాలయాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఇప్పటికే ఉన్నందున పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. నిజామాబాద్లో పసుపు బోర్డు పెట్టే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. ప్రపంచంలో మొత్తం పసుపు ఉత్పత్తిలో ఒక్క భారత్లోనే 78శాతం ఉత్పత్తి జరుగుతోందన్నారు. ప్రతీ ఏటా 11.53 లక్షల టన్నుల పసుపు దేశంలో ఉత్పత్తి అవుతోందని... ఇందులో 1.37లక్షల టన్నుల పసుపు ఒక్క తెలంగాణలోనే ఉత్పత్తి అవుతోందని చెప్పారు. దాదాపు 1.37 లక్షల ఎకరాల్లో తెలంగాణలో పసుపు సాగు అవుతోందన్నారు.

తెలంగాణకు పసుపు బోర్డు ప్రతిపాదన లేదని కేంద్రం తేల్చేయడంతో పసుపు రైతుల్లో ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. గత 2019 లోక్సభ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటే ప్రధానాంశంగా తెర పైకి వచ్చింది. ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను గెలిచిన నెల రోజులకే పసుపు బోర్డు తీసుకొస్తానని అప్పట్లో బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. దీంతో ప్రజలు కల్వకుంట్లను కవితను కాదని అరవింద్ను గెలిపించారు. అరవింద్ గెలిచి రెండేళ్లవుతున్నా పసుపు బోర్డు పత్తా లేదని పలుమార్లు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్రం చేసిన ప్రకటనపై నిజామాబాద్ రైతుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications