కేసీఆర్ 20 ఏళ్లు పోరాడినా 'నో యూజ్' : జానారెడ్డి, ఆ మూడు కోతుల వల్లే ఇదంతా : నారాయణ
తెలంగాణ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎల్పీ నేత జానారెడ్డి. తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ, కేసీఆర్ వలనే అయితే ఇంకో 20 ఏళ్లపాటు పోరాడినా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేది కాదన్నారు. సోనియా గాంధీ చొరవ వల్లే ప్రత్యేక తెలంగాణ కల సాకారమైందని చెప్పుకొచ్చిన జానారెడ్డి, తెలంగాణ ప్రజల మనోభావాలను సోనియా గాంధీ గుర్తించారు కాబట్టే.. తెలంగాణ ఇచ్చారని తెలిపారు.
పాలేరు ఉపఎన్నిక సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొన్న జానారెడ్డి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఇలా అయితే రాష్ట్రం బంగారు తెలంగాణ కాదని, భయభ్రాంతుల తెలంగాణ అవుతుందని ఎద్దేవా చేశారు. విపక్ష పార్టీ నేతల ఫిరాయింపులకు అధికార పక్షమే కారణమే అని ఆరోపించిన ఆయన ప్రలోభాలకు లొంగనివారిపై టీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు.
తిరుపతి : ఏపీ ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు సీపీఐ నేత నారాయణ. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టిన ఆయన ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ముగ్గురు మూడు కోతుల్లా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ముగ్గురు నేతలు ప్రత్యేక హోదా గురించి వినొద్దు, చూడొద్దు, మాట్లాడొద్దు అన్న తరహాలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తిరుపతిలో జరిగిన మీడియా సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన నారాయణ.. ప్రత్యేక హోదా ద్వారా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని సూచించారు. ఇందుకోసం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతునివ్వాలని చెప్పారు. పనిలో పనిగా తమిళ రాజకీయాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం.