అన్నంత పని చేశారు : చంద్రబాబు హైదరాబాద్ ఇంటికి నీళ్లు కట్..
హైదరాబాద్ : పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మకాంని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ లో ఆయన ఉంటున్న నివాసం ప్రస్తుతం పునర్నిర్మిస్తున్నారు. కాగా.. ఇంటి నిర్మాణానికి సంబంధించి జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకోకపోవడంతో.. జలమండలి నీటి సరఫరాను నిలిపివేసిన సంగతి కూడా తెలిసిందే.
ఇంటి నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక వసతి కోసం బంజారాహిల్స్ రోడ్ 24 లోని అద్దె ఇంట్లోకి మారారు చంద్రబాబు. జలమండలి ప్రతీ రోజు మూడు ట్యాంకర్ల నీటిని ఇంటి అవసరాల కోసం సరఫరా చేసింది. మొత్తంగా చంద్రబాబు అద్దె ఇంట్లో నెలవారీ నీటి వినియోగం 4.50 లక్షల లీటర్ల నీళ్లు. ప్రస్తుతం ఆ ఇంటిని కూడా ఖాళీ చేయడంతో నీటి సరఫరాను నిలిపివేశారు అధికారులు. ఉపయోగంలో లేదు కాబట్టే నీటి సరఫరా నిలిపేయాల్సి వచ్చిందని చెప్తున్నారు.
చంద్రబాబు విజయవాడకు మారిపోయిన తర్వాత ఆయన నివాసానికి కరెంట్, నీళ్లు సరఫరా నిలిపేయాలని ఓయూ జేఏసీ జీహెచ్ఎంసీ కమీషనర్ కు విజ్ఞప్తి చేసింది. జేఏసీ ఫిర్యాదుతోనే జలమండలి నీటి సరఫరాను నిలిపివేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి మాత్రం యథాతంగా నీళ్లు సరఫరా అవుతున్నాయి. క్యాంప్ ఆఫీస్ అవసరాల కోసం నెలకు 2.31 లక్షల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది.