కూల్చింది అక్రమ నిర్మాణాలను కాదు.!ప్రజల బతుకులను.!కేసీఆర్ పై మండిపడ్డ టీటీడిపి ఛీఫ్.!
హైదరాబాద్ : చట్టం కొందరికే చుట్టం కారాదని, న్యాయం అందరికీ సమంగా జరగాలని, ప్రజలకు మేలు చేయడానికే చట్టంగాని, కీడు చేయడానికి కాదన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు బక్కని నర్సింహులు. పేదల ఇళ్ల కూల్చివేతపై బక్కని నర్సింహులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ విధానాల మీద మండిపడ్డారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈశ్వర్ కాలనీలో ఇళ్ల కూల్చివేత ప్రాంతాల్లో టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు శుక్రవారం పర్యటించారు. బాధిత కుటుంబాలు తమ గోడు వెల్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా బక్కని నర్సింహులు మాట్లాడారు. ముందస్తు నోటీసులివ్వకుండా ఇళ్ల కూల్చివేత అప్రజాస్వామికమని, ఉరి తీసేటప్పుడు కూడా చెప్పుకోడానికి ఏమైనా ఉందా అని అడుగుతారని, అలాంటిది దౌర్జన్యంగా, ఏకపక్షంగా కూల్చివేతలు అమానవీయమని ఆగ్రహం వ్యక్తం చేసారు.
అక్రమ నిర్మాణాలైనప్పుడు మీటర్ నంబర్లు ఎందుకిచ్చారని, కరెంటు బిల్లులు ఎందుకు కట్టించుకున్నారని బక్కని నర్సింహులు నిలదీసారు. ఇష్టారాజ్యంగా కూల్చివేతలు తగదని, చట్టం కొందరికే చుట్టం కారాదని, న్యాయం అనేది అందరికీ సమంగా జరగాలని ప్రభుత్వానికి హితవు పలికారు. బిడ్డలకు విద్యాబుద్దులు చెప్పే సంస్థలపై కూడా దౌర్జన్యానికి పాల్పడి కూల్చివేయడం బాధాకరమన్నారు. ప్రజలకు మేలు చెయ్యడానికే చట్టంగాని, కీడు చేయడానికి కాదని బక్కని నర్సింహులు ధ్వజమెత్తారు.
సమాచార వ్యవస్థ ఇంత వేగవంతమైన రోజుల్లో కూడా సకాలంలో సరైన సమాచారం ఇవ్వకపోవడం గర్హనీయమని, సామాజిక సేవలందించే స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలల భవనాలు కూలగొట్టడం అన్యాయమే కాదు అవమానకరంగా ఉందని పేర్కొన్నారు. ఏకపక్షంగా ఇళ్ల కూల్చివేతలపై జిల్లాకలెక్టర్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా, బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని బక్కని నర్సింహులు భరోసా ఇచ్చారు.