ఏపీలోనే కాదు తెలంగాణాలోనూ రేషన్ మాఫియా.. పట్టింపేది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. మొన్నటికి మొన్న కాకినాడ పోర్ట్ లో రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన ఘటన మర్చిపోకముందే తాజాగా విశాఖపట్నం రేషన్ బియ్యం పట్టుబడింది. విశాఖపట్నం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేయగా 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాలు సీజ్ చేశాయి.
ఏపీలోనే కాదు తెలంగాణాలోనూ రేషన్ మాఫియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ రేషన్ దందా యదేచ్చగా సాగుతుంది. గ్రామం, పట్టణం, నగరం అన్న తేడా లేకుండా రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. రేషన్ షాపుల నుంచి అక్రమ దందా చేసే వారికి రేషన్ బియ్యం చేరుతుంది. ఇక రైస్ మిల్లులను సైతం రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి యదేచ్చగా దందా సాగిస్తున్నారు. లారీల ద్వారా రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు కాకినాడ విశాఖ పోర్టులకు తరలిస్తున్నారు.

తెలంగాణా రేషన్ మాఫియాపై ఫోకస్ ఏది?
రేషన్ మాఫియాను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్, పౌరసరఫరాల శాఖలు దాడులు నామమాత్రంగా సాగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట పట్టుబడుతున్న రేషన్ బియ్యం పోగా భారీగా సాగే దందా అధికారుల కనుసన్నలలోనే సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానూ రేషన్ మాఫియా రెచ్చిపోతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దందా పైన పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు.
ఏపీని మించి తెలంగాణాలోనూ రేషన్ దందా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున రేషన్ దందా సాగుతుందో, అంతే స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రేషన్ దందా సాగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఇక తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం ఏన్గల్ గ్రామం వద్ద ఉన్న రైస్ మిల్లుకు తరలిస్తున్న బియ్యాన్ని టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 240 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి నమోదు చేశారు.
చిన్న చిన్న కేసులు చేసి మమ అంటున్న అధికారులు
ఇక మక్తల్ పట్టణ శివారులోను బొలెరో వాహనంలో తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ తాజాగా భారీగా రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న 285 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చెక్పోస్ట్ వద్ద తనిఖీలలో భాగంగా పట్టుకున్నారు. ఇక తాజాగా హనుమకొండ లోను పక్కదారి పడుతున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
చంద్రబాబు తరహాలో రేవంత్ కూడా దృష్టి సారిస్తారా?
అయితే ఇవన్నీ చిన్న స్థాయిలో జరుగుతున్న దందా మాత్రమే.. ఇంతకు మించి రేషన్ మాఫియా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కూడా దందా చేస్తోంది. దీనిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రేషన్ మాఫియా పై ఉక్కు పాదం మోపటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications