పవన్ కళ్యాణ్ది పవనిజం కాదు, బ్రోకరిజం: పిడమర్తి రవి వ్యాఖ్య
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్కల్యాణ్ది పవనిజం కాదని, అది బ్రోకరిజమని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, హైదరాబాదులోని జాంబాగ్ డివిజన్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎన్నికల ఇన్చార్జి పిడమర్తి రవి అన్నారు. టీడీపీ, బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్ను రంగంలోకి దింపుతారని ప్రచారం జరుగుతోందని, ఆయన పవనిజం తెలంగాణలో పని చేయదని హెచ్చరించారు.
జాంబాగ్ డివిజన్లోని న్యూ ఉస్మాన్గంజ్ రక్తమైసమ్మ దేవాలయం వద్ద బుధవారం టీఆర్ఎస్ నాయకుల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తేనే సినీ నటుడు పవన్కల్యాన్ ఎదుగుతున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ కోతలు లేని విద్యుత్, డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.

గోషామహల్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ప్రేమ్కుమార్ ధూత్ మాట్లాడుతూ - గోషామహల్ డివిజన్లోని అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ విజయం తథ్యమన్నారు. టీఆర్ఎస్ నాయకుడు ఆర్వి మహేందర్కుమార్ మాట్లాడుతూ - ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలను కార్యకర్తలకు సూచించారు.
సమావేశంలో గ్రేటర్ టీఆర్ఎస్ యువత ఉపాధ్యక్షుడు ఎస్.ధన్రాజ్, టీఆర్ఎస్ నాయకులు పి.వినోద్ గుప్తా, జి.నందుకుమార్, వీరుసింగ్, సురేష్ ముదిరాజ్, శాంతిదేవి, యాదగిరి, జైశంకర్, సాయి, వాసుదేవరావు, రవీంద్రచారి, ధరంవీర్, షాహద్, మునావర్, ఎమ్మార్పీఎస్ నాయకులు బోయిని ఎల్లేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications