రేవంత్ ఇష్యూ మలుపు తిరగనుందా: వాయిస్ శాంపిల్ ఇవ్వకుంటే?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం కీలక మలుపు తిరగనుందా? అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో ఆడియో రికార్డింగ్ పరీక్షల అనంతరం ఏం జరుగనుందో తెలియనుంది. రికార్డింగ్ టేపులను ఎఫ్ఎస్ఎల్కు పంపడం కీలక పరిణామంగా చెప్పవచ్చు.
ఎప్ఎస్ఎల్కు నిందితులు, ఫిర్యాదుదారుల సెల్ ఫోన్లను ఏసీబీ పంపించింది. అందులో స్టీఫెన్ సన్, చంద్రబాబు వాయిస్ రికార్డ్ ఉన్నట్లుగా చెబుతున్న సెల్ ఫోన్ కూడా ఉంది.
ఎప్ఎస్ఎల్ పరీక్షల నిమిత్తం ఏసీబీ 14 వస్తువులను ల్యాబ్కు పంపించింది. నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాల ఫోనలు మూడు, ఫిర్యాదుదారు స్టీఫెన్ సన్ ఫోన్లు, మరో వ్యక్తి మాల్కమ్ టేలర్ ఫోన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు మల్టిపుల్ సోనీ డిజిటల్ ఆడియో రికార్డ్స్, హార్డ్ డిస్క్లు పంపించారు.
చంద్రబాబు ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో మాట్లాడినట్లుగా ఓ ఆడియో ఉంది. అది కీలకంగా మారింది. దానిని స్టీఫెన్ సన్ రికార్డు చేసినట్లుగా భావిస్తున్నారు. స్టీఫెన్కుచెందిన రెండు ఫోన్లను ల్యాబ్కు పంపించిందని తెలుస్తోంది.
ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆడియో రికార్డ్లో ఉన్నది చంద్రబాబు గొంతా లేక మరొకరిదా గుర్తిస్తారు. ఆ గొంతు ఎవరిదో తేలాక ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు.
ఆడియో టేపుల్లో వచ్చిన గొంతుతో అరెస్టైన నిందితుల గొంతును, స్టీఫెన్తో మాట్లాడిన అదృశ్య వ్యక్తి గొంతును ప పోల్చుకునేందుకు ఏసీబీ న్యాయస్థానాన్ని అనుమతి కోరుతుంది. అలాగే, స్టీఫెన్, ఇద్దరు సాక్ష్యులు (కూతురు జెస్సికా, మాల్కోం టేలర్) స్టేట్మెంట్ను కోర్టుకు ఇస్తారు.
వాయిస్ శ్యాంపిల్స్ ఇవ్వకుంటే..!
ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్తో పోల్చుకునేందుకు నిందితుల వాయిస్ శాంపిల్స్ తీసుకుంటారు. నిందితులు లేదా అనుమానితులు స్వచ్ఛంధంగా వాయిస్ శాంపిల్స్ ఇవ్వకుంటే వారు పబ్లిక్ స్పీచ్లలో మాట్లాడిన, అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగాలు తీసుకుంటారు. స్టీఫెన్తో మాట్లాడింది చంద్రబాబుగా చెబుతున్నారు.