"నుమాయిష్-2026"కు వేళాయే... తేదీలు, టికెట్ ధర అనౌన్స్ !!
హైదరాబాద్ నగర ప్రజలు ప్రతి ఏడాది ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసే నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) 2026 తేదీలు అధికారికంగా ఖరారయ్యాయి. 85వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన-2026కు సంబంధించిన పూర్తి వివరాలను అనౌన్స్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన జనవరి 1, 2026న ప్రారంభమై ఫిబ్రవరి 15, 2026 వరకు మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుందని వివరించారు.
ప్రారంభోత్సవ వివరాలు..
ఈసారి నుమాయిష్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కలిసి ఘనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

సందర్శన సమయాలు & టికెట్ ధరలు..
ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు,
శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు.
ఈసారి ప్రవేశ టికెట్ ధరను రూ.50గా నిర్ణయించారు. అదే విధంగా, ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.
స్టాళ్లు & వ్యాపార అవకాశాలు..
ఈ ఏడాది నుమాయిష్లో మొత్తం 1,050 స్టాళ్లకు అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు), హస్తకళలు, చేనేత ఉత్పత్తులు.. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థాలు, స్వదేశీ ఉత్పత్తులు వంటి వాటిని ప్రజల ముందుకు తీసుకురావడానికి ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
అంతే కాకుండా షాపింగ్తో పాటు వినోదానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పిల్లలు, కుటుంబ సభ్యులను ఆకట్టుకునేలా ఆటవిడుపు పరికరాలు, ఫుడ్ కోర్టులు.. సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
కాగా నుమాయిష్ ను కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాకుండా, హైదరాబాద్ నగర సంస్కృతి, వ్యాపార వైభవాన్ని ప్రతిబింబించే వేడుక అని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, వ్యాపారులను ప్రోత్సహించి ఈ 85వ నుమాయిష్ను ఘనవిజయంగా మార్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications