హైద్రాబాద్ మెట్రోకు ఏపీ 'కడియం' సొబగులు, ఎక్కడా లేని టెక్నాలజీ..
రాజమండ్రి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఉన్న నర్సరీల్లోని మొక్కలతో సుందరీకరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోమవారం నాడు తెలిపారు.
తమకు దాదాపు నాలుగు లక్షల సుందరీకరణ మొక్కలు, లక్ష వరకు వృక్ష జాతులు అవసరమని చెప్పారు. వాటిని కడియం నుంచి తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు.
సోమవారం నాడు ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టును 2017 జూన్ లోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 55 శాతం పనులు పూర్తయినట్లు ఆయన తెలిపారు.
గతంలో 50 లక్షల జనాభా ఉన్న నగరాలకు పరిమితమైన మెట్రో రైళ్లు ఇప్పుడు ఇరవై లక్షల జనాభా ఉంటే నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కిలోమీటరు మేర నిర్మాణానికి సుమారు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా వినియోగించని టెక్నాలజీని హైదరాబాద్ మెట్రోలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ల నుంచి అవసరమైన వారికి తమ ఇళ్లను అనుసంధానం చేస్తూ స్కైవాక్ వారధులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.