వీసా షాక్: న్యూజిలాండ్ నుంచి 150మంది తెలుగు విద్యార్థుల వెనక్కి
హైదరాబాద్: నకిలీ వీసాలు తెలుగు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. నకిలీ వీసా పత్రాల కారణంగా న్యూజిలాండ్లో విద్యనభ్యసించేందుకు వెళ్లిన సుమారు 150మంది హైదరాబాద్ విద్యార్థులను ఆ దేశం వెనక్కి పంపేసింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో హైదరాబాద్ చేరుకున్నారు విద్యార్థులు.
కాగా, హైదరాబాద్, పంజాబ్లలోని ఏజెంట్లు తమకు నకిలీ ఆర్థిక పత్రాలు, ఇచ్చి మోసం చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే న్యూజిలాండ్ ప్రభుత్వ వర్గాలు తమను వెనక్కి పంపేశాయని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, తెలుగు విద్యార్థులకు అక్కడి వలస కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచి అక్లాండ్లో సెప్టెంబర్ 26న నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. అడ్మిషన్, ఏజెంట్స్ కమీషన్, పీజుల కోసం వారు 20వేల నుంచి 25వేల డాలర్ల వరకు చెల్లించుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా హఫీజ్ సయ్యద్ అనే విద్యార్థి మీడియాతో మాట్లాడారు. తాను కంప్యూటర్స్ చదివేందుకు వచ్చానని, కానీ, ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదువుతున్నాయని చెప్పారు. తన కుటుంబంలో తానే ఎక్కువగా చదువుకున్న వాడినని, ఎంతో కష్టపడి ఇక్కడ చదివేందుకు వచ్చానని తెలిపారు. ఏజెంట్లను గుడ్డిగా నమ్మడమే తాను చేసిన తప్పని హఫీజ్ తెలిపారు. ఏజెంట్లు చేసిన మోసం వల్ల తామంతా నిందితులుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు.
విద్యార్థులు నేరపూరితులయ్యారు: న్యూజిలాండ్
నకిలీ డాక్యుమెంట్లు సమర్పించిన కారణంగా హైదరాబాద్ నుంచి వచ్చిన సుమారు 150మంది విద్యార్థులకు తమ దేశం విడిచివెళ్లాలనే లేఖలు అందజేయడం జరిగింది. దీనిపై హఫీజ్ సయ్యద్ అనే విద్యార్థి ఓ న్యాయవాదిని సంప్రదించి న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్కు స్పందనను అందజేశారు. అయితే, దాన్ని తిరస్కరించడం జరిగింది.
'విద్యార్థులు వారు సమర్పించిన డాక్యుమెంట్లకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవి కేవలం వీసాలు కాదు. వారిలో కొందరు న్యూజిలాండ్లో నేర పూరితులయ్యారు' అని విద్యాశాఖ మంత్రి స్టీవెన్ జాయ్స్ వెల్లడించారు.
కాగా, 'బిజినెస్ స్టడీ కోసం నేను న్యూజిలాండ్కు గత నవంబర్లో వచ్చాను. నా వీసా పత్రాలు చట్టబద్ధంగా లేవన్న విషయం నాకు తెలియదు. నేను ఫీజుగా 17వేల డాలర్లు చెల్లించాను. అంతేగాక, 20వేల డాలర్లను ఖర్చు చేసుకున్నాను' అని చింతా సునీల్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.