కేకేపై డీఎస్ అభిప్రాయం?, కేసీఆర్లాగే సెంటిమెంట్, నమ్మకాలు..!
హైదరాబాద్: సమైక్యాంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ ఛీప్లుగా పని చేసిన డీఎస్, కేకేలు ఇద్దరూ టీఆర్ఎస్లో చేరి, గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే వారిద్దరి మధ్య పొసగడం లేదని ప్రచారం జోరుగా జరుగుతుంది.
నిజంగానే వారిద్దరి మధ్య విబేధాలున్నాయా? కేకే గురించి డీఎస్ ఏమనుకుంటున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన డీఎస్ ఏ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చింది మేమేనన్న నేతలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో కింది స్ధాయి కార్యకర్తల నుంచి రాజకీయ ఉద్దండుల వరకూ ఉన్నారు.
ఆ జాబితాలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలు తన సేవలందించిన కేకే గతంలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరితే, డీఎస్ ఈ మధ్యనే టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. వీరిద్దరూ టీఆర్ఎస్లో చేరడంతో వారిద్దరి మధ్య పోసగడం లేదనే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై సీఎం కేసీఆర్ కేకేనే సంప్రదించేవారు.

కానీ ఇప్పుడు డీఎస్ కూడా టీఆర్ఎస్ చేరడంతో కేకే ప్రాధాన్యం తగ్గుతోందని ప్రచారం జరుగుతోంది. కానీ కేకే విషయంలో డీఎస్కు ఉన్న అభిప్రాయం ఎంటీ అనేది ఆసక్తికరంగా మారింది. కేకేతో తనకు ఎలాంటి విబేధాలు లేవని చెప్పేశారు డీఎస్. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మనసులో మాట చెప్పేశారు.
కేకే తనకంటే పెద్దవాడని, తనకు రాజకీయ గురువాలాంటి వారని చెప్పేశారు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో ఎవరికి ఎంత ప్రాధాన్యం అనే విషయంలో పార్టీలో నేతల్లో క్లారిటీ లేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్లో చేరిన కేకేకు పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్కు ఏ పదవి ఇస్తారనే చర్చ మొదలైంది.
కేబినెట్లో మంత్రి పదవి ఇస్తారా లేదా పార్టీకి ఆయన సలహాలు వాడుకుంటారా లేక ఢిల్లీ స్ధాయిలో పదవి కట్టబెడతారా? అన్న క్లారిటీ లేదు. కేసీఆర్ లాగే డీఎస్కు సెంటిమెంట్, నమ్మకాలు ఎక్కువే అంటున్నారు. సాయిబాబాని నమ్ముకున్న తర్వాత డీఎస్కు అంతా మంచే జరిగిందని, అందుకే గురువారం సెంటిమెంట్ను నమ్ముతారు. సాధారణంగా డీఎస్ మీడియా సమావేశాలు గురువారం మాత్రమే నిర్వహిస్తారు.
కానీ డీఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరింది మాత్రం బుధవారం. గురువారం అష్టమి ఉండటంతో బుధవారమే డీఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కూడా సెంటిమెంట్, నమ్మకాలు ఎక్కువే కాబట్టి అష్టమి రోజున పార్టీలోకి ఎవరినీ చేర్చుకోరు.
టీఆర్ఎస్లో చేరిన తర్వాత డీఎస్ మీడియాతో మాట్లాడేందుకు ముహూర్తం పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇటీవలే సీఎం కేసీఆర్, డీఎస్ ఇంటికి బుధవారం వచ్చారు. అదే రోజు మీడియా డీఎస్ సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, బుధవారం కావడంతో సెంటిమెంట్ గురువారం మీడియాతో ముచ్చటించారు.
మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ ఏ పదవి మీకిస్తారని ప్రశ్నించడంతో అన్ని పదవులు అనుభవించాను. అనుభవించంది ఆ ఒక్క పదవే. ఆ పదవి ఆయన ఇవ్వలేడు. నేను అడుగలేనని చెప్పడం కొసమెరుపు. డీఎస్ చేపట్టనటువంటి ఆ ఒక్క పదవి సీఎం పోస్టే. దీంతో డీఎస్ మదిలో ఏముందనేది ఇంటా బయటా ఒకటే గుసగుసలాడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications