భారం కాకుడదని.. వృద్ద జంట ఘాతుకం..
తల్లిదండ్రులంటే నిస్వార్ధంతో ఉన్నదంతా తమ సంతాన అభివృద్దికే ఖర్చుపెడతారు. తమకు పుట్టిన వారు ప్రయోజకులు అయ్యోవరకు కడుపుకట్టుకుని కష్టపడతారు. సంపాదించిన సొమ్మంతా.. కన్న కొడుకు లేదా కూతుళ్లకు ముట్టజెప్పుతారు. చివరి రోజుల్లో తమకు ఏది అవసరం ఉన్నా...వారే పోషణ భారాన్ని మోస్తారనే చిన్న నమ్మకంతో సర్వస్వం ధారపోస్తారు. ఇది సగటు భారతీయ తల్లిదండ్రుల్లో ఉండే గొప్పగుణం.
అయితే ప్రస్తుత రోజులు మారుతున్నాయి. ఆధునిక సమాజంలో మానవత్వ విలువలు, కుటుంబాల బంధాలు మారిపోతున్నాయి. కన్నవారే భారమైపోతున్నారు. ఆర్థిక కష్టాలో లేక మారుతున్న సమాజ పోకడలో తెలియదు కాని, కాటికి దగ్గరవుతున్న తల్లిదండ్రులను చివరి ప్రస్థానంలో మానసిక హింసకు గురి చేస్తున్నారు. దీంతో వాళ్లు పెట్టే బాధను కొద్ది రోజులు భరిస్తున్న తల్లిదండ్రులు ఓపికగా జీవితాన్ని వెల్లదీస్తున్నారు. అయినా వారిలో మార్పు రాకపోతే చివరికి తల్లిదండ్రులే తనువు చాలిస్తున్న సంఘటనలు అందోళనను కల్గిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో ఎలకేశ్వరం గ్రామంలో ఇలాంటీ సంఘటనే జరిగింది. గ్రామంలోని రాళ్లబండి సాలయ్య (76), రాధమ్మ (66) వృద్ద దంపతులు తమ కొడుకు, కోడలకు భారం కాకుడదని నిర్ణయించుకున్నారు. వాళ్లు చూపించే అమానవీయ జాలికి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విషాదం ఏమిటంటే... చనిపోయిన తర్వాత కూడ తమ కుమారుడికి భారం కాకుడని నిర్ణయించుకున్నారు.
తమ శవయాత్రకు కావాల్సిన సరంజామా అంతా ముందే ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. అనంతరం మంచి ముహుర్తం చూసుకుని ప్రాణాలు విడిచారు. ఇక చనిపోయో ముందు కొత్త బట్టలు వేసుకుని ఇద్దరు భార్యభర్తలు పురుగుల మందు తాగి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కాగా ఆ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వాళ్లు ఎవరు కూడ పట్టించుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు.