లేటెస్టుగా ఓల్డెస్ట్ డైలాగ్.!కేసీఆర్ అవినీతి చిట్టా విప్పి ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తామన్న బండి సంజయ్.!
హైదరాబాద్ : ఉద్రిక్త పరిస్థితులు మధ్య తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రెండో రోజు సూర్యపేట జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. గులాబీ శ్రేణులు, కమలం కార్యకర్తలు కత్తులు దూసుకుంటున్న పరిస్దితులు నెలకొన్నాయి. ఈ సందర్బంగా జిల్లాలో బండి సంజయ్ పర్యటనను అడ్డుకునే దిశగా టీఆర్ఎస్ కార్యకర్తలు దురుసుగా వ్యవహరిస్తున్నారని బీజేపి ఆరోపిస్తోంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు మీద బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
కేసీఆర్ కు భయమంటే ఏంటో చూపిస్తా.. సూర్యపేట జిల్లాలో బండి సంజయ్ ఫైర్..
శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వరి రైతులను కలిసేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తొలిరోజు పర్యటనను పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నట్టుగానే రెండోరోజు కూడా నిలవరించే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు కమలం కీలక నేతలు. రైతులతో మాట్లాడుతుండగా అడ్డుకుని రైతులను భయభ్రాంతాలకు గురిచేసేందుకు యత్నించారని, పోలీసుల ఎదుటే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి ప్రయత్నిస్తూ బరితెగించి వ్యవహరిస్తున్నారని బీజేపి నేతలు మండి పడుతున్నారు.
బీజేపి శ్రేణులు తిరగబడితే ఏంటి నీ పరిస్థితి.. కేసీఆర్ పై ధ్వజమెత్తిన బండి సంజయ్..
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, పోలీసుల వైఖరిపై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం తన హక్కు, బాధ్యతని అన్నారు. తాము రైతులను కలుస్తుంటే టీఆర్ఎస్ నాయకులకు ఎందుకింత అసహనం అని ప్రశ్నించారు. చివరకు రైతులు తమను బాధను చెప్పుకోకుండా బెదిరించడమేంటని, వారిపై దాడులకు యత్నిస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలకు రాకుండా రైతులను ఖాళీ చేయిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండోరోజు ఎన్నో అడ్డంకులు.. ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్న బీజేపి పర్యటన..
అంతే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్ధ విధానాలు బయటపడతాయనే భయంతోనే దాడులకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. నిరసన పేరుతో కొందరు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలతో వస్తే మేం భయపడతామా? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడితే మీరు తట్టుకుంటారా? మీరు గ్రామాల్లో తిరగగలరా? అని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రైతులను కలిస్తే కూడా సీఎం చంద్రశేఖర్ రావు సహించలేకపోతున్నారని సీఎం ఆదేశాల మేరకే అడుగడుగునా అడ్డంకులు స్రుష్టిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రత్యక్షంగా ఈ దాడుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతాం.. ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తామన్న బీజేపి ఛీఫ్
తెలంగాణలో అరాచకం స్రుష్టిస్తూ బీజేపి నేతల కార్లపైకి రాళ్లు రువ్వుతూ, కోడిగుడ్లు విసురుతూ పాశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లేనని హెచ్చరించారు బండి సంజయ్. అరాచకం రాజ్యమేలుతున్నా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం చేష్టలుడిగి చూడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఎదుర్కొలేని టీఆర్ఎస్ నాయకులు పోలీసుల పర్యవేక్షణలో చాటుమాటుగా బీజేపీ నాయకుల కాన్వాయ్ పై కిరాయి గూండాలతో దాడులు చేయించారని, చంద్రశాఖర్ రావుకు భయమంటే ఏంటో చూపిస్తామని, గతంలో ఆయనకు సంబంధించిప అవినీతి చిట్టా విప్పి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.