పరీక్షల్లో ఫెయిలై పారిపోయాడనుకున్నారు: నాగపూర్లో పట్టుబడ్డాడు
హైదరాబాద్: కాశ్మీర్కు తరలిపోతూ నాగపూర్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కిన ముగ్గురు హైదరాబాదీల్లో ఒకతను 22 ఏళ్ల ఒమర్ ఫరూక్ హుస్సేనీ పరీక్షల్లో తప్పడంతో ఇంటి నుంచి పారిపోయాడని కుటుంబ సభ్యులు భావించారు. అతని కజిన్స్ అబ్దుల్లా బాసిత్, మాజ్ హసన్ ఫరూక్ 2014లో బంగ్లాదేశ్కు పారిపోతూ పశ్చిమ బెంగాల్లో పట్టుబడ్డారు.
ఆ సమయంలో ఫరూక్ హుస్సేన్కు ఉగ్రవాద కార్యకలాపాలపై అంతగా తెలియదు. అబ్దుల్ బాసిత్, మాజ్ హసన్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాలేదని తాజా సంఘటన తెలియజేస్తోంది. పైగా, బాసిత్ ఒమర్ ఫరూక్ హుస్సేన్కు ఉగ్రవాద కార్యకలాపాల గురించి, జిహాదీ గురించి నూరిపోశాడు.
దాంతో ఒమర్ ఫరూక్ విదేశాలకు పారిపోయి జిహాదీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి సిద్ధపడ్డాడు. ఐఎస్ఐఎస్ ప్రచారం సామాగ్రికి సంబంధించిన సమాచారాన్ని బాసిత్ అతనికి అందిస్తూ వెళ్లాడు. దీంతో ఇంట్లోంచి రూ.11,300 దొంగిలించి ఆ ఇద్దరితో పాటు దేశం వదిలి వెళ్లడానికి సిద్ధపడ్డాడు.

ట్విట్టర్, ఫేస్బుక్కుల్లో ఉగ్రవాద ప్రచార సామాగ్రి కోసం వెతుకుతూ ఉండేవాడినని, బాసిత్ తనను ఆ వైపుగా మళ్లించాడని ఒమర్ అంగీకరించినట్లు దర్యాప్తు అధికారులు అంటున్నారు. అతను అవంతి కాలేజీలో బిఎస్సీ మైక్రో బయోలజీ చదువుతున్నాడు. కొన్ని బ్యాక్ లాగ్స్ ఉండిపోయాయి.
కెరీర్పై తీవ్రమైన నిరాశ ఏర్పడడం, ఖరీదైన స్మార్ట్ఫోన్ చేతిలో ఉండడంతో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో మునిగిపోయాడు. ట్విట్టర్లో చాలా చురుగ్గా ఉండేవాడని, పలు ఈమెయిల్ ఐడిలు క్రియేట్ చేశాడని, బహుశా ఐఎస్ఐఎస్ సానుభూతిపరులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికే అలా చేసి ఉంటాడని భావిస్తున్నారు.
చాట్స్ను ఒమర్ ఫరూక్ హుస్సేన్ తొలగించాడని, వాటిని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. పరీక్షల్లో అతను విఫలం కావడం పట్ల తల్లిదండ్రులు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు.












Click it and Unblock the Notifications