అందమైన అమ్మాయిలు.. కోరుకున్న ప్యాకేజీలు.. 8 కోట్లకు ముంచారుగా..!
హైదరాబాద్ : అందమైన అమ్మాయిలు కావాలా? అయితే మా దగ్గర అనువైన ప్యాకేజీలు ఉన్నాయి. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ.. అలా ఏ ప్యాకేజీ కావాలంటే ఆ ప్యాకేజీ కింద ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. అమ్మాయిలతో మాట్లాడొచ్చు.. డేటింగ్ చేయొచ్చు.. మొత్తానికి ఫుల్ ఎంజాయ్ మీ సొంతం. ఇలాంటి ప్రకటనలతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ముఠా గుట్టు రట్టైంది. కోల్కతా కేంద్రంగా లవ్ ఆర్ట్ డేటింగ్ వెబ్సైట్ రన్ చేస్తూ యువకులకు గాలం వేస్తున్న ముగ్గురు సైబర్ నేరస్థులు హైదరాబాద్ పోలీసులకు చిక్కడం చర్చానీయాంశమైంది.
ఆన్లైన్ డేటింగ్తో గాలం.. కోట్లు కొల్లగొట్టిన ముఠా
ఆన్లైన్ డేటింగ్తో యువకులకు గాలం వేస్తూ కోట్లు కొల్లగొట్టిన ముఠా గుట్టు రట్టైంది. అందమైన అమ్మాయిలతో మాట్లాడొచ్చు.. డేటింగ్ కావాలంటే ఓకే అంటూ ఎందరో యువకులను బురిడీ కొట్టించిన ముఠా ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కింది. ప్యాకేజీల రూపంలో జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి చివరకు బెదిరించే ధోరణిలో మరింత డబ్బు గుంజి ఆటాడుకున్న ముగ్గురు ముఠా సభ్యుల పాపం పండింది.
కోల్కతాకు చెందిన ముగ్గురు సైబర్ నేరస్థులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అమాయకులను టార్గెట్ చేస్తూ ఈ ముఠా దాదాపు 8 కోట్ల రూపాయల మేర కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేయడం గమనార్హం.
టెలీ కాలర్స్తో ఫోన్లు చేయిస్తూ.. కస్టమర్లకు రొమాన్స్ పాఠాలు..!
కోల్కతాకు చెందిన 26 ఏళ్ల సోమ రొకా, అర్నాబ్సుర్ తో పాటు 23 సంవత్సరాల మహ్మద్ ఇమ్రాన్ ఈ ముఠా సభ్యులుగా గుర్తించారు పోలీసులు. లవ్ ఆర్ట్స్ పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్న ఈ ముఠా దేశవ్యాప్తంగా యువకులకు గాలం వేస్తోంది. ఆన్లైన్ డేటింగ్ సర్వీసెస్ పేరుతో అమాయకులను నట్టేట ముంచుతూ కోట్లు గడించింది. రెండేళ్ల వ్యవధిలోనే దాదాపు 8 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లు సమాచారం.
అందమైన అమ్మాయిలతో గంటల తరబడి మాట్లాడొచ్చు, డేటింగ్ చేయొచ్చంటూ ప్రకటనలు గుప్పించిన ఈ ముఠా వెబ్సైట్కు అనతికాలంలోనే ఆదరణ పెరిగింది. అయితే మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ.. ఇలా ప్యాకేజీల రూపంలో సర్వీసులు అందిస్తామని ఉదరగొట్టింది. అలా వీరిని సంప్రదించిన యువకులను నట్టేట ముంచింది.
ఒక్క ఫోన్ కాల్.. పది బూతులు.. కేటీఆర్ను కూడా తిట్టిన అధికారి..!
కాల్ సెంటర్తో నష్టాలు.. ఆన్లైన్ డేటింగ్తో లాభాలు
సోమ రొకా అనే యువతి రెండేళ్ల కిందట కాల్ సెంటర్ నిర్వహించింది. అందులో 20 మంది యువతులను టెలీకాలర్స్గా నియమించుకుంది. అర్నాబ్సుర్ తో పాటు మహ్మద్ ఇమ్రాన్ను మేనేజర్లుగా ఏర్పాటు చేసింది. అయితే కాల్ సెంటర్లో నష్టాలు రావడంతో రూట్ మార్చింది సోమ రొకా. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ ఇలా ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ ప్రారంభించి యువకులను మోసగిస్తూ కోట్లు రాబట్టింది.
అమ్మాయిలతో ఛాటింగ్ కోసమో, డేటింగ్ కోసమో ఈ వెబ్సైట్ను క్లిక్ చేస్తే చాలు.. మొదట 1,025 రూపాయలను రిజిస్ట్రేషన్ కింద చెల్లించమని అడుగుతారు. ఆ తర్వాత అసలు కథ మొదలు అవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక టెలీ కాలర్ ఫోన్ చేసి పూర్తిస్థాయి మెంబర్ షిప్ కోసం 18 వేల రూపాయలు చెల్లించాలని అడుగుతుంది. అది పూర్తయ్యాక మరో టెలీకాలర్ ఫోన్ చేసి.. మీ రిజిస్ట్రేషన్ దాదాపు పూర్తి అయినట్లేనంటూ ఫోటో, ఐడీ పంపిస్తే చాలంటూ కబుర్లు చెబుతుంది. అలా అవి కూడా పంపించాక మరో సీన్ క్రియేట్ చేస్తారు ముఠా సభ్యులు.
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక అసలు కథ.. బెదిరిస్తూ, డబ్బులు గుంజుతూ..!
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఓన్లీ ఛాటింగ్ అంటే రోజుకోసారి ఓ యువతి గంట సేపు మాట్లాడుతుందని చెబుతారు. డేటింగ్ కోసం దేశవ్యాప్తంగా ఎక్కడైనా యువతులను సమకూరుస్తామని నమ్మిస్తారు. అయితే కొంతమంది యువతుల ఫోటోలు, వారి వివరాలు వెబ్సైట్లో పొందుపరచడంతో అది నిజమని నమ్ముతారు చాలామంది. ఆ క్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక సదరు యువకులకు సంబంధించిన ఫోటోలు, చిరునామా తదితర వివరాలను ఈ ముఠా సభ్యులే ఇతర డేటింగ్ సైట్లలో పెట్టేవారు. అలా తిరిగి వీళ్లే వాళ్లకు ఫోన్ చేసి మీ ఫోటోలు, వివరాలు ఫలానా వెబ్సైట్లో ఉన్నాయి. మీరు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బెదిరించేవారు. కోల్కతా కేంద్రంగా మీమీద కేసులు నమోదు అవుతున్నాయని భయపెట్టేవారు. పోలీసులు మీ దగ్గరకు రావొద్దంటే కొంత సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేసేవారు.
ఆ ముగ్గురు అరెస్ట్.. జైలుకు పంపిన సైబర్ క్రైమ్ పోలీసులు
ఈ ముఠా చేతిలో మోసపోయిన హైదరాబాద్ వ్యక్తి ఒకరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మొదట రిజిస్ట్రేషన్ కింద 1,025 రూపాయలు, 18 వేల రూపాయలు చెల్లించానని.. ఆ తర్వాత తనను బెదిరించడంతో ఒకసారి 75 వేల రూపాయలు.. మరొకసారి లక్షా 20 వేలు చెల్లించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఇంకోసారి బెదిరించడంతో చివరకు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు కూపీ లాగితే ఈ ముఠా గుట్టురట్టైంది. దాంతో కోల్కతా వెళ్లిన హైదరాబాద్ పోలీసులు.. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.