కెసిఆర్ సక్సెస్, చంద్రబాబు ఫెయిల్: ఎందుకు?
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షాలను బలహీనపరచడంలో ఇక్కడి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విజయం సాధిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు విఫలమవుతున్నారనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్లో ఇద్దరిదీ ఒక్కటే దారి అయినప్పటికీ కెసిఆర్ సాధించిన ఫలితాలు చంద్రబాబు సాధించడం లేదనే మాట వినిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఒక్కరొక్కరే వచ్చి చేరారు. తెలంగాణలో 15 మంది టిడిపి ఎమ్మెల్యేలు గెలిస్తే పది మంది తెరాసలోకి దూకేశారు. ఏకంగా శాసనసభా పక్ష నేతనే సైకిల్ను దిగి కారెక్కేశారు. టిడిపిలో కేవలం ఐదుగురు శాసనసభ్యులు మాత్రమే మిగిలారు.
Also Read: ఎవరూ మిగలరు జాగ్రత్త: వైయస్ జగన్కు టీడీపీ నేతల హెచ్చరిక
వరుస ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో తెరాస విజయాలను అందుకుంటూ వస్తోంది. దానికితోడు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసు అంత బలంగా లేదు. కాంగ్రెసుకు నాయకుడే లేడని నారాయణ ఖేడ్ శాసనసభ ఉప ఎన్నిక ప్రచారంలో అన్నారు. ఆ ముమ్మాటికీ నిజమేనని అనిపించకమానదు. పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపై నడిపించే నాయకుడు కాంగ్రెసుకు లేకుండా పోయారు.
స్లమ్ లో రియాల్టీ షో ; ఈ రోజు కార్టూన్
దానికితోడు, డి. శ్రీనివాస్ వంటి పలువురు సీనియర్ కాంగ్రెసు నాయకులు కూడా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అవతలి పార్టీల నుంచి వచ్చి చేరేవారికి కెసిఆర్ తగిన స్థానం కల్పిస్తూ వస్తున్నారు. అలా కల్పించే సమయంలో మొదటి నుంచీ పార్టీలో ఉన్న నాయకుల నుంచి అసంతృప్తి ఎదురు కాకుండా చూసుకుంటున్నారు. దానివల్ల ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరినప్పుడు తెరాస చెక్కు చెదరడం లేదు. ఈ విషయంలో కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
అంతే కాకుండా, ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కెసిఆర్ తనయుడు కెటి రామరావు, మేనల్లుడు హరీష్ రావు పకడ్బందీగా అమలు చేస్తూ వస్తున్నారు. బేరసారాలు ముగిసిన తర్వాత ఏకంగా కెసిఆర్ వద్దకు వెళ్లి పార్టీ కండువా మెడపై వేసుకునేలా వాళ్లు జాగ్రత్త వహిస్తున్నారు. పార్టీలోని సీనియర్ నాయకులకు తగిన గౌరవం ఇస్తూనే వారిద్దరు పార్టీని బలోపేతం చేసే విధంగా వలసలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
Also Read: సీమకు వెళ్లిపోతారు: బెజవాడకి బాబు హెచ్చరిక, ఏకైక సీఎంగా రికార్డ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే, హైదరాబాద్ వంటి రాజధాని లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఎక్కువగా విజయవాడలోనే ఉంటున్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హైదరాబాదు నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వైయస్ జగన్ చంద్రబాబు నాయుడికి గట్టి పోటీ ఇస్తున్నారు. అనుభవరాహిత్యం కారణంగా వ్యూహంలో, దాన్ని అమలు చేసే విషయంలో అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తున్నప్పటికీ జిల్లా పర్యటనలు చేస్తూ కార్యకర్తలకు నమ్మకం కలిగించే పని చేస్తున్నారు.
చంద్రబాబునాయుడికి కెసిఆర్కు హరీష్ రావు, కెటిఆర్ సహకరించినట్లుగా సహకరించే నాయకులు లేకుండా పోయారు. తనయుడు నారా లోకేష్ వ్యూహాలు, వాటి అమలు అంతగా ఫలితాలు ఇవ్వడం లేదు. తెలంగాణలో పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కూడా చంద్రబాబు తెలంగాణకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోవడం వల్లనే వచ్చింది. అయినా, ఆయన తెలంగాణను వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న నాయకులను చేర్చుకోవడంలో ఆయనకు ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించలేకపోతున్నారు. జిల్లాల్లోని టిడిపి నాయకుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత ఆయనకు పెద్ద ఆటంకంగా మారుతోంది. పార్టీలో మొదటి నుంచీ ఉన్న నాయకులను ఒప్పించలేకపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కూర్పు ఓ కారణంగా కనిపిస్తోంది.
పలు జిల్లాల్లో గ్రూపులు బలంగా ఉండడం, ఒక గ్రూపు ఒక పార్టీలో ఉంటే మరో గ్రూప్ మరో పార్టీలో ఉండడం సంప్రదాయంగా వస్తోంది. రెండు గ్రూపులు ఒక పార్టీలో ఇమడని పరిస్థితి ఉంటుంది. ఇలా ఇమిడ్చే చంద్రబాబు ప్రయత్నాలు తగిన ఫలితాలు ఇవ్వడం లేదు.
జమ్మలమడుగు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చాలా కాలం నుంచి టిడిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదు. అలాగే, విశాఖపట్నం జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ కూడా చాలా కాలంగా టిడిపిలో చేరడానికి నిరీక్షిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఇలాంటి నాయకులు ఉన్నారు. వారి వ్యతిరేకులను ఒప్పించడంలో చంద్రబాబు ఫలితం సాధించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో కులాల సమీకరణలు కూడా చంద్రబాబుకు ఆటంకంగా మారాయి. తెలంగాణలో కుల సమీకరణాలు అంత బలంగా పనిచేయవు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి మధ్య పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా పొత్తు కుదరడం చాలా కష్టం. అలాగే, కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మధ్య కూడా పొత్తు కుదర్చడం కష్టం. అయితే, ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఉన్న గ్యాప్ను కొంత మేరకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పూడ్చారు.
ఇప్పుడు చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకును కూడా కొల్లగొట్టడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోని బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే, రాయలసీమలో ఉన్న గ్రూపు రాజకీయాల కారణంగా ఆ ప్రయత్నాలకు విఘాతం ఏర్పడుతోంది. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి నాయకులను ఒక శాసనసభా నియోజకవర్గంలో ఒక్క పార్టీలోకి చేర్చడం గగనమైన విషయం. అది చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.