దళితబంధు - సాధికారత, అభివృద్ధి బాట ..!!
దళితబంధు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన పథకం. ముఖ్యమంత్రి మానస పుత్రిక దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న పథకం. దళితుల సాధికారతకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపుతోంది. అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. విడతల వారీగా అర్హులైన అందరికీ లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దళితబంధు పథకం నీతి అయోగ్ కమిటీ సభ్యుల ప్రశంసలు అందుకుంది.
ప్రతీ కుటుంబానికి రూ 10 లక్షలు: తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పరిశ్రమలను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడంకోసం ఈ పథకం ఉపయోగపడుతుంది.
2021, ఆగస్టు 4న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించారు. వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్ల నిధులను విడుదలజేయడం ద్వారా ఈ పథకం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో తొలి విడతగా 100 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.

నీతి అయోగ్ ప్రశంసలు: దీనిలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 38,012 మంది అర్హులను గుర్తించి నిధులను మంజూరు చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఆ నియోజకవర్గంలో అర్హులైన మొత్తం 18,021 మంది దళితులకు రూ.10 లక్షల చొప్పున అందజేసింది. అనంతరం వాసాలమర్రి గ్రామంతోపాటు చింతకాని, చారుగొండ, నిజాంసాగర్, తిరుమలగిరి మండలాల్లో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసారు.
దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న దళితబంధు పథకం నీతి అయోగ్ కమిటీ సభ్యుల ప్రశంసలు అందుకుంది. విశ్వనాథ్ బిష్ణయ్ నేతృత్వంలోని నీతి అయోగ్ బృందం 2022 సెప్టెంబరు 16న హుజురాబాద్ పట్టణంలో పర్యటించి దళితబంధు లబ్దిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను పరిశీలించింది.
రెండో విడత నిధులు మంజూరు: రెండవ విడత కింద 1,30,000 కుటుంబాలకు రెండవ విడత దళితబంధు పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాల్సిందిగా సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగష్టు 16 వ తేదీన దళితబంధు వేడుకలను ఘనంగా జరపాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. హుజురాబాద్ నియోజకవర్గంలో 100 శాతం దళితబంధు పథకాన్ని అమలు చేసారు.
మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 1100 మందికి ఈ దఫాలో దళితబంధును అందించాలని నిర్ణయించారు. ఈ దఫా మొత్తంగా 1,29,800 కుటుంబాలకు దళితబంధును అమలు చేయనున్నారు. మరో 200 మంది లబ్దిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి అప్పగించారు.

ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ: తద్వారా... మొత్తంగా 1,30,000 కుటుంబాలకు దళితబంధును అందించడం జరుగుతుంది. గతంలో మాదిరిగా జిల్లా కలెక్టర్లు లబ్దిదారులను ఎంపిక చేస్తారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహా ఆవిష్కరణ.. ఆయన జన్మదినోత్సవమైన ఏప్రిల్ 14న ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం నలుమూలనుంచి లక్షలాదిమంది దళితబిడ్డలను హైద్రాబాద్ కు ఆహ్వనించి వారి సమక్షంలో ఆవిష్కరించాలని, ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం తుది ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications