ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి..! నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారన్న కవిత..!!
నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితకు కోపం వచ్చింది. నిజామాబాద్ లో తనపైన ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో తనను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో బీజేపీ, కాంగ్రెస్ లు ఏకమయ్యాయని, రెండు జాతీయ పార్టీలూ ఒకటై, తనను టార్గెట్ చేశాయని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె, ఎవరెన్ని ఎత్తుగడలు, కుట్రలు చేసినా గెలిచేది తానేనని అన్నారు కల్వకుంట్ల కవిత.
ఈ ఐదేళ్లలో బీజేపీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని ఆరోపించిన ఆమె, పసుబు బోర్డు ఇచ్చేందుకు కావాల్సినంత అధికారం బీజేపీ వద్ద ఉందని, అయినా, రైతుల గోడును పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి పసుపు బోర్డును ఇస్తామని చెబుతున్నారని, వారి మాటలను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేయాలని కోరారు. బీజేపీ చెబుతున్న తప్పుడు హామీలను యువత నమ్మరాదని కవిత కోరారు.