తెలంగాణ సర్కారు మరో సంచలనం: మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత తొలగింపు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని తొలగించింది. ఈ మేరకు పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల గన్మెన్స్ను పోలీస్ శాఖ విత్ డ్రా చేసుకుంది. ఇక ఎవరెవరికి గన్మెన్స్ అవసరమనే దానిపై ఇంటెలీజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. ఆ తర్వాత వారికి గన్మెన్స్ కేటాయించే అవకాశం ఉంది.
మరోవైపు, ఈరోజే తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అంతేగాక, మూసీ అభివృద్ధి సంస్థ ఇంఛార్జీ ఎండీగానూ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు, విద్యుత్ శాఖలో మాత్రం భారీ మార్పులు చేపట్టింది.

ట్రాన్స్కో, జెన్కో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా రిజ్వీని నియమించింది. ఈయన ఇప్పటికే ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు. ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా నియామకయ్యారు. ఇక, టీఎస్ఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ముషారఫ్ అలీ, టీఎస్ఎన్పీడీసీఎల్ (వరంగల్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి నియమితులయ్యారు. డిప్యూటీ సీఎం ఓఎస్డీగా ఐఏఎస్ అధికారి కృష్ణప్రసాద్, అగ్రికల్చర్ డైరెక్టర్గా గోపీ నియమితులయ్యారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణికి కీలక బాధ్యతలు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం శైలజా రామయ్యర్ యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications