ముందస్తు పై కేసీఆర్ మనసు మార్చుకోవడం వెనక అసలు రహస్యం ఇదే..!!
Recommended Video
రాజకీయాల్లో తొందరపాటు ఎంత మాత్రం పనికి రాదు. ప్రజల నాడి తెలుసుకోకుండా తీసుకున్న నిర్ణయాల కారణంగా పార్టీలతో పాటు నాయకులు కూడా దారుణ వైఫల్యాలను మూటగట్టుకున్న అనుభవాలు కోకొల్లలు. నిజానికి కేసీఆర్ కూడా తొందరపాటు నిర్ణయాల కారణంగా దెబ్బతిన్న వారే. అనవసరంగా ఉప ఎన్నికలు తీసుకురావడం ద్వారా ఆయన గతంలో రెండు సార్లు అవమానాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. హంగ్ వస్తుందన్న అంచనాతో ముందస్తుగా ఎమ్మెల్యేలతో క్యాంపులు ఏర్పాటు చేయించి గతంలో ఆయన దెబ్బతిన్నారు కూడా. కేంద్రంలో యూపీఎ రాదన్న అంచనాతో ఫలితాలు రాకుండానే ఎన్డీఎ శిబిరంలో హడావుడి చేసి చేతులు కాల్చుకున్న చరిత్ర కేసీఆర్ కు ఉంది. రాజకీయ దురందరులు కూడా ఒక్కొక్కొ సారి బొక్కబోర్లా పడ్డ వారే. అందుకేే ముందస్తుపైన చంద్రశేఖర్ రావు పీచేమూడ్ అన్నట్టుగా ప్రగతి భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
కేసీఆర్ ను అంచనా వేయడం కష్టం..! ముందస్తుపై వెనక్కి తగ్గడంలో రాజకీయం కోణం..!
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందస్తుపైన వెనకంజ చేశారు. అసెంబ్లీ రద్దు ఆలోచనను విరమించుకున్నారు.లోక్ సభ ఎన్నికలకు ముందే తెలంగాణలో మరో సారి గులాబీ జెండా ఎగురవేయాలన్న వూహ్యాన్ని ఆయన పక్కన పెట్టారు.ముందస్తుతో ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించాలన్న ఆలోచనను పక్కన పెట్టారు. సెప్టెంబర్ లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ప్రత్యర్థులను కవ్వించిన చంద్రశేఖర్ రావు రాజకీయ చతురతను చూపించారు. మొత్తానికి రాష్ట్ర ప్రజల్లో ముందస్తు ఆలోచనలను రాజేసిన కేసీఆర్ ఊహించని విధంగా వెనకడుగు వేశారు.పది రోజుల వ్యవధిలో వ్యూహాన్ని మార్చిన ఆయన..తనను పసిగట్టడం అంత సులువు కాదని వ్యతిరేకులకు సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ స్వల్ప వ్యవధిలో కేసీఆర్ ఎందుకు తన ఆలోచనను మార్చుకున్నారన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది.
నా మాటే శాసనం అనే కేసీఆర్ ఎందుకు మెత్తబడ్డారనే అంశం పై ఉత్కంఠ..!!
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గ్యారెంటీ అని పదే పదే ప్రకటనలు చేస్తున్న చంద్రశేఖర్ రావు ముందస్తుపైన వెనుకంజ వేయడానికి గల కారణాలను విశ్లేషకులు వెతుకుతున్నారు. సిట్టింగ్ లకే సీట్లు ఇస్తానని బల్లగుద్ది చెప్పడంతో పాటు సెప్టెంబర్ లోనే అభ్యర్థులను ప్రకటిస్తానన్న కేసీఆర్ సడన్ గా ప్లేట్ ఎందుకు ఫిరాయించాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మంత్రులు చెపితే చంద్రశేఖర్ రావు ముందస్తుపైన అభిప్రాయాన్ని మార్చుకున్నాడంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో కేసీఆర్ మాటే ఫైనల్. రాజకీయ వ్యూహాలన్ని ఆయన బుర్రలోనుంచి వచ్చినవే. అయితే ముందస్తుపైన ఒక అడుగు ముందుకేసి మీడియాకు ఎక్కిన కేసీఆర్ వెనక్కి వెళ్లే వ్యవహారాన్ని మాత్రం మంత్రులపైకి నెట్టినట్లు కనిపిస్తోంది.మెజార్టీ మంత్రుల అభిప్రాయం ప్రకారం ముందస్తు ఎన్నికలకు వెళ్లోద్దని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
అంతా ఓకే..! ఐనా ఎక్కడో తేడా..! అందుకే ముందస్తు..! అంతలోనే వెనకడుగు..! అర్థం కాని కేసీఆర్..!
ముందస్తు ప్రకటన చేసిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అభిప్రాయాలను ఇంటలిజెన్స్ ద్వారా సేకరించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. ప్రధానంగా కేసీఆర్ బీజేపీతో ఏదో రహాస్య ఒప్పందం ఉందనే భావన సర్వత్రా వ్యక్తమైంది. మోదీతో మాట్లాడిన తర్వాతే ముందస్తుపైన చంద్రశేఖర్ రావు చర్చ ప్రారంభించడం అనుమానాలకు తావిచ్చింది. శాసనసభకు,లోక్ సభకు వేరు వేరుగా ఎన్నికలు తీసుకురావాలన్న కేసీఆర్ ఎత్తుగడకు సరైన లాజిక్ లేదు. ఎప్పుడైనా వందసీట్లు గెలుస్తామన్న విశ్వాసమున్నప్పుడు ఆరునెలల ముందు అసెంబ్లీని రద్దు చేయడం ఎందుకన్న మౌళిక ప్రశ్నకు టీఆర్ఎస్ వద్ద సమాధానం లేదు. 60 యేళ్లలో లేని అభివ్రుద్ధి, సంక్షేమం జరుగుతున్నప్పుడు హడావుడి అవసరం లేదు కదా అన్న సందేహం అందరి మెదళ్లను తొలుస్తోంది.
రాజకీయ కోణంలో ముందస్తు అంటే టీఆర్ఎస్ కు పరాజయం తప్పదు..!
నిజానికి టీఆర్ఎస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హమీల్లో కొన్ని ఇంకా పూర్తిగా నేరవేరలేదు. కొన్ని సగంలో ఉండగా మరికొన్ని పావు వంతు మాత్రమే పూర్తయ్యాయి.దళితులకు మూడెకరాల భూమి పంపకం ముందుకు కదలడం లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం అనుకున్నంత స్థాయిలో జరగడం లేదు. రిజర్వేషన్ల పెంపు అంశం మూలనపడింది.ఉద్యోగాల భర్తీపైన నిరుద్యోగుల నుంచి అసంత్రుప్తి ఉంది. మిషన్ భగీరథ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. కాళేశ్వరం ఫలితాలు రావడానికి ఇంకా సమయం పట్టడం ఖాయం. ఇలాంటి కొన్ని మేజర్ హామీలపైన ప్రజలను ప్రభుత్వం సంత్రుప్తి పర్చాల్సి ఉంది. వచ్చే ఆరునెలల సమయాన్ని ఇందుకోసం కేసీఆర్ వినియోగించుకోవచ్చు కదా అన్న అనుమానులు ఉన్నాయి. రాజకీయంగా ప్రతిపక్షాలను దెబ్బతీయడం కోసం మాత్రమే చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే అభిప్రాయం జనంలో కల్గితే అసలుకే మోసం వచ్చే ఛాన్స్ లేకపోలేదు. అందుకే ఇప్పుడు చంద్రశేఖర్ రావు వ్యూహాం మార్చినట్లు కనిపిస్తోంది.