ఓయులో కెసిఆర్కు దెబ్బతో చలనం: ఘంటా చక్రపాణితో భేటీ, ఇలా...
ఉస్మాని విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవంతో తెలంగాణ సిఎం కెసిఆర్లో కదలిక వచ్చిందని అంటున్నారు.
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల తీరుకు దిగ్భ్రాంతికి గురైన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నష్టనివారణ చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. తన పట్ల ఓయు విద్యార్థులు ఎందుకంత తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారో తెలుసుకుని నివేదిక సమర్పించాలని నియోగించిన కమిటీ సభ్యులు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సి) చైర్మన్ ఘంటా చక్రపాణితో సమావేశమయ్యారు.
దొరికితే చాలు: మరోసారి తప్పులో కాలేసిన నారా లోకేష్
అంతకు ముందు కమిటీ సభ్యులు తమ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అనుకూలంగా ఉండే విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఇటీవల వివరాలు సేకరించారు. ఆ వివరాల ఆధారంగా నష్టనివారణ చేపట్టే పనిలో భాగంగానే వారు చక్రపాణితో సమావేశమైనట్లు తెలుస్తోంది.
ఘంటా చక్రపాణితో భేటీ తర్వాత కమిటీ సభ్యులు మీడియాతో చెప్పిన విషయాలు కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల వ్యతిరేకతను గుర్తింంచినట్లు అర్థమవుతోంది. ఉద్యోగాల కల్పనే ప్రధాన సమస్యగా కూడా కమిటీ సభ్యులు గుర్తించినట్లు భావించడానికి వీలవుతోంది.
కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ
ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు సహా పలు వర్గాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మి యువత మోసపోవద్దని కోరారు. ఎంపీ బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వేగంగా ఉద్యోగాల నియామక ప్రక్రియ సాగుతుందని చెప్పారు. చక్రపాణితో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
చక్రపాణిని కలిసింది వీరే...
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న నియామక ప్రక్రియ గురించి తెలుసుకునేందుకు ఓయూ పూర్వ విద్యార్థులైన టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ ఆంజనేయగౌడ్, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నేతలు రాకేశ్ తదితరులు శుక్రవారం చైర్మన్ ఘంటా చక్రపాణిని కలిశారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుందని బాల్క సుమన్ చెప్పారు. గురుకులాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుందని, రాత పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ చైర్మన్ చెప్పారని ఎంపీ వివరించారు.
ఈ నియమాకాలు కూడా..
త్వరలో విద్యాశాఖ పరిధిలోని డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కూడా కమిషన్ సిద్ధపడుతోందని బాల్క సుమన్ తెలిపారు. జేఎల్, డీఎల్, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపక పోస్టుల విషయంలో స్పష్టత వచ్చి త్వరలో ఉద్యోగ ప్రకటన వస్తుందని చెప్పారు. యువత సంక్షేమం విషయంలో కేసీఆర్ పెద్దన్నలాగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారని ఆయన చెప్పారు. అయి నా ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నాయని వారి ఆరోపణలు పట్టించుకోకుండా యువత పరీక్షలకు సిద్ధమవ్వాలని బాల్క సుమన్ అన్నారు.
పోస్టులకు పచ్చజెండా ఊపాలని
నిరీక్షణలో ఉన్న పోస్టులకు పచ్చజెండా ఊపాలని బాల్క సుమన్ బృందం సీఎస్ ఎస్పీ సింగ్ను శుక్రవారం కోరింది. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి క్లియర్ చేయాలని విన్నవించింది. వివిధ శాఖలు సమన్వయంతో సాగేలా చూడాలని బృందం సభ్యులు ఎస్పీ సింగ్ను కోరారు.