తెలంగాణ ప్రజలకు గర్వకారణం: కేసీఆర్ను కలిసిన డా. నాగేశ్వరరెడ్డి (ఫోటోలు)
హైదరాబాద్: పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ నాగేశ్వరరెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర తరపున పద్మ పురస్కారాలకు తన పేరు సిఫారసు చేసినందుకు సీఎం కేసీఆర్కు నాగేశ్వర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పద్మభూషణ్ పురస్కారాన్ని వరించిన నాగేశ్వరరెడ్డిని సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించి అభినందించారు. మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న నాగేశ్వర్రెడ్డికి పద్మ భూషణ్ రావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు.
అనంతరం డాక్టర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ అందరి సమిష్టి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వ్యక్తిగత విజయం కంటే మా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అహర్నిశలు చేసిన కృషికి ప్రతిఫలమిదన్నారు.
కేసీఆర్ను కలిసిన డా. నాగేశ్వరరెడ్డి
ఈ అవార్డుతో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. త్వరలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిని విస్తరిస్తున్నామన్నారు. గచ్చిబౌలిలో వేయి పడకల సామర్థ్యంతో వచ్చే ఏడాది నుంచి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. ఇక్కడ పరిశోధనలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు.
కేసీఆర్ను కలిసిన డా. నాగేశ్వరరెడ్డి
పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యసేవలు అందించేందుకు, అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలను రూపొందించనున్నామన్నారు. డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్గా కొనసాగుతున్నారు. 1972-78లో కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
కేసీఆర్ను కలిసిన డా. నాగేశ్వరరెడ్డి
ఆ తర్వాత 1979-82లో మద్రాసు మెడికల్ కళాశాలలో ఎండీ, 1982-84లో గ్యాస్ట్రో ఎంటరాలజీని చండీగఢ్లో పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 1989 వరకు పనిచేసిన ఆయన... గుంటూరు మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా 1990 వరకు సేవలు అందించారు.
కేసీఆర్ను కలిసిన డా. నాగేశ్వరరెడ్డి
డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సేవలను గుర్తిస్తూ ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అవార్డులను అందజేశాయి. 2002లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.