ప్రతీకారం: హైదరాబాద్ సహా 6 నగరాలపై టెర్రరిస్ట్లతో కలిసి పాకిస్తాన్ భారీ కుట్ర
హైదరాబాద్: యూరి ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ఎల్వోసీని దాటి చేసిన సర్జికల్ స్ట్రయిక్ దాడులకు పాకిస్తాన్ ఏజెన్సీలు ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ స్పై ఏజెన్సీ ఐఎస్ఐ భారత దేశంలోని ఐదు ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకున్నదని, ఇందుకోసం తీవ్రవాద గ్రూపుల సహకారం కోరిందని తెలుస్తోంది.
ఈ ఆపరేషన్కు 'ఆపరేషన్ క్లీన్ హార్ట్' అని పేరు పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. భారత్లోని ఆరు ప్రధాన నగరాల పైన కన్నేశాయని సమాచారం. ఇందులో హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులు ఉన్నాయి. సర్జికల్ దాడులను జీర్ణించుకోలేని పాకిస్తాన్.. ఉగ్రవాదుల సహాయంతో దాడి చేసేందుకు పాక్ భారీ ప్రణాళికను సిద్దంచేస్తోంది.
బంగ్లాదేశ్లో గతేడాది శిక్షణ పొందిన జమాతే ఈ ఇస్లామీ సంస్థకు చెందిన పన్నెండు మంది ఉగ్రవాదులను దాడులకు సిద్ధం చేస్తున్నట్లు భారత నిఘావర్గాల వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందని తెలుస్తోంది. శిక్షణ పొందిన ఉగ్రవాదులకు గన్స్ ఏవిధంగా వాడాలో, భారతీయ జవాన్లను ఎలా ఎదుర్కొవాలో శిక్షణ ఇచ్చినట్లు నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.
వెంటనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. జనసామర్థ్యం ఎక్కువగా ఉన్న చోట భద్రతను పెంచాలని కోరింది. ఉగ్రవాదుల కదలికలపై సమాచారాన్ని రా(రిసెర్చ్ అనాలిసిస్ అండ్ వింగ్), ఐబీ, రక్షణ శాఖ ఇంటిలిజెన్సీ, నావికాదళాలు సమాచారాన్ని ఎప్పటికప్పుడూ పంచుకుంటూ చురుకుగా వ్యవహరిస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.