నేటినుండి 15రోజుల పాటు తెలంగాణాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు.. ప్రణాళిక ఇదే!!
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి పదిహేను రోజుల పాటు ఐదో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే నాలుగు విడతలుగా జరిగిన ఈ కార్యక్రమం పల్లె ప్రగతిలో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, పచ్చదనంతో పల్లెలు వెల్లివిరిసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మరోమారు ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నేటి నుండి ప్రారంభం కానుంది.

ఇక పల్లె ప్రగతి కార్యక్రమాలు ఇలా
రోడ్లు, డ్రైనేజ్ ల నిర్వహణ, సీజనల్ వ్యాధులు, పారిశుధ్యం , ఘన వ్యర్థాల నిర్వహణ మరియు తెలంగాణకు హరితహారం కార్యకలాపాలపై ముందస్తు జాగ్రత్తలు మరియు నివారణ చర్యలు ఈ కార్యక్రమం కింద చేపట్టే పనులలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఐదో విడత పల్లె ప్రగతిలో భాగంగా తొలి రోజు గ్రామసభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళికను తయారుచేయాల్సి ఉంటుంది. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, నాలుగు విడతల్లో సాధించిన ఫలితాలను నివేదిక రూపంలో గ్రామసభ ఎదుట చదివి వినిపించాలి. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రోజులు రోడ్లు, డ్రైనేజీలు శుభ్రపరచాలి.

ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలు ఇలా
గ్రామస్తుల సహకారం తో శ్రమదానం ద్వారా పిచ్చి మొక్కలు తొలగించి, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించడం తో పాటు, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటడం చేపట్టాలి. రెండు రోజులపాటు ప్రజోపయోగ సంస్థలను శుభ్రం చేయాలి. ఒకరోజు పవర్ డే పాటించాలి. విలేజ్ డంపింగ్ యార్డ్, వైకుంఠధామం తదితరాలను పరిశీలించి సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. తెలంగాణ రాష్ట్రంలోని క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుపై శ్రద్ధ వహించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదో విడతలో ప్రధానమైన అంశాలను కూడా ప్రకటించింది. ఇక నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో అధికారులు, ప్రజా ప్రతినిధులు పల్లె , పట్టణాల మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి.. హైదరాబాద్ లో సన్నాహాలు
అంతేకాదు నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలనే దానిపై జిహెచ్ఎంసిలో అధికారులతో సమావేశమయ్యారు మేయర్ జే. విజయలక్ష్మి. ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారని, ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

ఎండలు బాగా ఉండటంతో పల్లె పట్టణ ప్రగతి నేటి నుండి ప్రారంభం
ఇదిలా ఉంటే విపరీతమైన భానుడి భగభగల మధ్య పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని అధికారులు కోరడంతో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి జూన్ 3వ తేదీ నుంచి పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. జూన్ 3వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు 15 రోజుల పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications