'తెలంగాణలోని 890 గ్రామాల్లో ఏకగ్రీవం'
తెలంగాణలో పల్లె పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 11(గురువారం)న జరిగే పోలింగ్ కు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు సమాయత్తం అయినట్లు వివరించారు. గురువారం పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. తొలి విడతలో 395, అలాగే రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పల్లెల్లో పోరు ఆసక్తిగా మారుతోంది. ప్రత్యర్థులు నువ్వానేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటూ కీలకమే కాబట్టి.. అభ్యర్థులు అత్యధిక మంది మద్దతును కూడగట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సామాజిక వర్గాలు, మహిళా, యువ సంఘాలు, వలస ఓటర్లు ఇలా వర్గాల వారీగా వారిని ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు.
ఈసారి పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అప్పటివరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలై సాయంత్రానికి ఫలితాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు.

మరోవైపు తొలి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వివరించారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు తనిఖీల్లో రూ. 8.2 కోట్లు సీజ్ చేశామని తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు వీలుగా 50 వేల మంది సివిల్ పోలీసులను విధుల్లో పెట్టినట్లు వివరించారు. అలాగే 60 ప్లటూన్స్ బృందాలు బయటి నుంచి వచ్చాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications